Anil Deshmukh release | మహారాష్ట్ర మాజీ మంత్రి అనిల్ దేశ్ముఖ్ జైలు నుంచి విడుదలయ్యారు. ఈయన గత ఏడాది కాలంగా ముంబైలోని ఆర్థర్ రోడ్ జైలులో ఉంటున్నారు. ఇవాళ జైలు నుంచి విడుదల సందర్భంగా ఆయన మద్దతుదారులు అనిల్ దేశ్ముఖ్కు ఘన స్వాగతం పలికారు. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) నమోదు చేసిన అవినీతి కేసులో అనిల్ దేశ్ముఖ్ నిందితుడు. రాష్ట్ర హోం మంత్రిగా తన పదవిని దుర్వినియోగం చేశారని, కొంతమంది పోలీసు అధికారుల ద్వారా ముంబైలోని వివిధ బార్ల నుంచి రూ.4.70 కోట్లు వసూలు చేసినట్లు సీబీఐ తన అభియోగపత్రంలో పేర్కొన్నది.
బెయిల్ కోసం అక్టోబర్ 26న బాంబే హైకోర్టును అనిల్ దేశ్ముఖ్ ఆశ్రయించగా.. సీబీఐ వ్యతిరేకించింది. కాగా, ఈ 73 ఏండ్ల వయసున్న నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) నాయకుడిని తొలిసారిగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) 2021 నవంబర్లో అరెస్టు చేసింది. గత ఏడాది మే 11న ఈడీ నమోదు చేసిన మనీ-లాండరింగ్ కేసు ఎఫ్ఐఆర్ ఆధారంగా ఏప్రిల్ 21 సీబీఐ కేసు నమోదు చేసింది. ‘నాకు న్యాయవ్యవస్థపై పూర్తి విశ్వాసం ఉన్నది. నన్ను తప్పుడు కేసులో ఇరికించారని హైకోర్టు గుర్తించింది’ అని అనిల్ దేశ్ముఖ్ జైలు నుంచి విడుదల అనంతరం చెప్పారు. అజిత్ పవార్తో పాటు పలువురు సీనియర్ ఎన్సీపీ నాయకులు జైలు వెలుపల ఆయనకు స్వాగతం పలికారు.
బెయిల్ ఆర్డర్ను వ్యతిరేకిస్తూ డిసెంబరు 16న సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పి) దాఖలు చేసినట్లు సీబీఐ న్యాయవాది శ్రీరామ్ శిర్సత్ జస్టిస్ ఎస్ జి చపాల్గావ్కర్తో కూడిన సింగిల్ జడ్జి వెకేషన్ బెంచ్కు తెలిపారు. అత్యున్నత న్యాయస్థానం సెలవులో ఉన్నందున విచారణ జరపలేకపోయిందని, సుప్రీంకోర్టు తిరిగి విధులు ప్రారంభించేంత వరకు స్టే కొనసాగించాలని ఆయన హైకోర్టును అభ్యర్థించారు.