ముంబై, ఫిబ్రవరి 12: లోక్సభ ఎన్నికల ముందు కాంగ్రెస్కు భారీ ఎదురుదెబ్బ తగిలింది. మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ సోమవారం కాంగ్రెస్ పార్టీని వీడారు. చవాన్ బీజేపీ వైపు మొగ్గుచూపుతున్నారనే ఊహాగానాల మధ్య ఈ పరిణామం చోటు చేసుకున్నది. రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటేల్కు రాసిన లేఖలో చవాన్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి ఆ పత్రాన్ని అసెంబ్లీ స్పీకర్ రాహుల్ నార్వేకర్కు సమర్పించారు. మహారాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేతలు బాబా సిద్ధిఖీ, మిలింద్ దేవరా పార్టీని వీడిన కొన్ని రోజులకే చవాన్ కాంగ్రెస్ను వీడడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విలేకరులతో మాట్లాడుతూ ఆగే ఆగే దేఖో హోతా హై క్యా.. ముందు ముందు ఏం జరుగుతుందో చూడండి.. అని అన్నారు. చవాన్ మరాఠ్వాడా ప్రాంతంలోని నాందేడ్ జిల్లాకు చెందిన వారు. ఆయన తండ్రి దివంగత శంకర్రావ్ చవాన్ కూడా మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2010లో ముంబైలోని ఆదర్శ్ హౌసింగ్ స్కాంలో ప్రమేయం ఉండటంతో అశోక్ చవాన్ ముఖ్యమంత్రి పదవిని కోల్పోయారు. 2014-19 మధ్య మహారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్గా చవాన్ బాధ్యతలు నిర్వర్తించారు.
రెండు రోజుల్లో కార్యాచరణ: అశోక్ చవాన్
రాజీనామా అనంతరం చవాన్ మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ లో జరుగుతున్న వాటి గురించి బహిరంగ వేదికపై తాను మాట్లాడనని చెప్పారు. తన రాజకీయ భవిష్యత్తు గురించి రెండు రోజుల్లో నిర్ణయం ప్రకటిస్తానని అన్నారు. బీజేపీలో చేరుతారా? అన్న ప్రశ్నకు తానింకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని బదులిచ్చారు. కాంగ్రెస్ని వీడటం తన వ్యక్తిగత నిర్ణయమని, అందుకు కారణాలు చెప్పదల్చుకోలేదన్నారు. బీజేపీ కాంగ్రెస్ ఆక్రమిత పార్టీగా మారబోతున్నదని శివసేన (యూబీటీ) నాయకుడు ఉద్ధవ్ ఠాక్రే పేర్కొన్నారు. 2024లో తమ పార్టీ 400 సీట్లు గెలుచుకుంటుందని ప్రధాని మోదీ ఘంటాపథంగా చెబుతున్నప్పుడు ఇతర పార్టీలను ఎందుకు విచ్ఛిన్నం చేస్తున్నారని ఆయన ప్రశ్నించారు. దేశంలో బీజేపీ ఏం చేస్తున్నదో ప్రజలు గమనిస్తున్నారని ఠాక్రే అన్నారు.