భోపాల్: బీజేపీ అధినాయకత్వంపై ఇటీవల తరచూ విమర్శలు చేస్తున్న ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, మధ్యప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఉమాభారతి కీలక వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాలను వీడలేదని, వచ్చే ఎన్నికల్లో పోటీచేస్తానని ప్రకటించారు. తాను సుదీర్ఘ కాలం పని చేసినందువల్ల ఐదేండ్లపాటు విరామం తీసుకోవాలని నిర్ణయించుకున్నానని, అందుకే గత ఎన్నికల్లో పోటీ చేయలేదని చెప్పారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేస్తానన్నారు. రాష్ట్రంలోని బుందేల్ఖండ్ ప్రాంతంలో ఉన్న సాగర్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ‘నాకు 75 ఏండ్లు వచ్చినా, 85 ఏండ్లు వచ్చినా, రాజకీయాల్లో చురుగ్గానే ఉంటాను. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తా. నాకు రాజకీయాలంటే చాలా ఇష్టం’ అని చెప్పారు. మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చే నవంబర్లో జరుగాల్సి ఉన్నది.