PM Modi | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, ఆగస్టు 1 (నమస్తే తెలంగాణ): అధికారాన్ని నిలబెట్టుకోవడానికి ప్రధాని మోదీ ఎంతకైనా తెగిస్తాడని జమ్ముకశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్ అన్నారు. ఎన్నికల ముందు బాంబులు పేలొచ్చు లేదా ఎవరైనా ప్రముఖ బీజేపీ నేత హత్య జరగవచ్చు అంటూ సంచలన ఆరోపణలు చేశారు. తద్వారా ప్రజల సానుభూతి కోసం వెంపర్లాడే అవకాశాలున్నాయని వ్యాఖ్యానించారు. 2024 సాధారణ ఎన్నికల్లో బీజేపీకి ఓటమి తప్పదని, ఎన్నికల తరువాత ప్రధాని మోదీ అడ్రస్ గల్లంతవుతుందని అన్నారు. తాజాగా ఆయన ఓ హిందీ వెబ్సైట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీజేపీ పాలనపై ప్రజలు సంతోషంగా లేరని, అన్ని రంగాల్లో ఘోరంగా విఫలమయిందని అన్నారు. యూపీ సీఎం యోగి అదిత్యనాథ్ అనుకూల వ్యక్తులకు మోదీ అంటే పడదని, రానున్న ఎన్నికల్లో 200 కంటే ఎంపీ సీట్లు తగ్గితే.. బీజేపీ నాయకులే మోదీని తప్పిస్తారని పేర్కొన్నారు. యోగి అనుయాయుల్లో ఒకరు తనతో మాట్లాడుతూ ఈ విషయం చెప్పారన్నారు. వచ్చే లోక్సభ ఎన్నికల్లో మేఘాలయ, పంజాబ్, హర్యానా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, బెంగాల్, మహారాష్ట్రలలో బీజేపీకి పరాభవం తప్పదని జోస్యం చెప్పారు.
ఎమర్జెన్సీ కంటే అధ్వాన్నం
మోదీ చుట్టూ అంతా అవినీతిపరులే ఉన్నారని ఆరోపించారు. తన చేతిలోకి సీబీఐ, ఈడీ, ఐటీ వంటి దర్యాప్తు సంస్థలను ప్రతిపక్షాలు, అసమ్మతులపైకి ఉసిగొల్పుతూ భయపెట్టాలని అనుకొంటున్నారని, వచ్చే లోక్సభ ఎన్నికల్లో మోదీకి ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. ఈశాన్య రాష్ర్టాలలో ఉద్రిక్తతలకు, ప్రజలు రెండు వర్గాలుగా చీలిపోవడానికి కేంద్ర ప్రభుత్వం, ప్రధాని మోదీనే కారణమన్నారు. ప్రధాని మోదీ పాలన ఎమర్జెన్సీ పాలన కంటే అధ్వాన్నంగా ఉందన్నారు.
ఇదేనా మీ ‘బేటీ బచావో’?
మణిపూర్లో మహిళలపై అమానుష ఘటనలు జరిగినా, ఏమీ పట్టనట్టు ప్రధాని వ్యవహరిస్తున్నారని సత్యపాల్ దుయ్యబట్టారు. మణిపూర్ హింసపై పార్లమెంటులో ప్రతిపక్షాలు నిలదీస్తున్నా, ఆయన నోటి వెంట ఒక్క మాట కూడా రావడం లేదని విమర్శించారు. బీజేపీ ఎంపీ బ్రిజ్భూషణ్ లైంగిక వేధింపులకు పాల్పడ్డాడని మహిళా రెజ్లర్లు రోజుల తరబడి ఆందోళన చేసినా ఆయనకు పట్టలేదని.. ఇదేనా ‘బేటీ బచావో’ అని నిలదీశారు.