Nisha Bangre | హైదరాబాద్, ఏప్రిల్ 13 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ పార్టీని నమ్మితే నట్టేట్లో మునిగి పోయినట్టేనని, వందేండ్ల చరిత్ర గల ఆ పార్టీ తనకు నమ్మకద్రోహం చేసిందని మధ్యప్రదేశ్కు చెందిన మాజీ డిప్యూటీ కలెక్టర్ నిషా బంగ్రే తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు ‘ఇండియన్ ఎక్స్ప్రెస్’ పత్రికకు ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆమె వెల్లడించారు.
చాతర్పూర్ జిల్లాలోని లవ్కుశ్నగర్లో సబ్-డివిజనల్ మెజిస్ట్రేట్గా పనిచేస్తున్న తనను రాజకీయాల్లోకి రావాలని కాంగ్రెస్ నేతలు ఆహ్వానించినట్టు బంగ్రే గుర్తు చేశారు. తొలుత అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్లా నియోజకవర్గం నుంచి తనను అభ్యర్థిగా ప్రకటిస్తామని అప్పటి కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు కమల్నాథ్ నమ్మబలికినట్టు వెల్లడించారు. దీంతో తాను ఎంతో కష్టపడి సంపాదించిన కలెక్టర్ కొలువును కూడా వదిలిపెట్టి రాజకీయాల్లోకి వచ్చినట్టు తెలిపారు. అయితే, స్థానిక రాజకీయాల పేరిట ఆమ్లా టికెట్ను మరొకరికి కేటాయించారని ఆమె వాపోయారు. ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లోనూ తనకు ప్రాధాన్యం ఇవ్వకుండా మరొకరికి టికెట్ ప్రకటించినట్టు మండిపడ్డారు.
మీడియా ఎదుట ప్రకటనలు చేయవద్దని, కొన్ని అంశాల మీదే మాట్లాడాలంటూ పార్టీ సీనియర్ నేతలు తనపై ఆంక్షలు విధించేవారని బంగ్రే వాపోయారు. కలెక్టర్ ఉద్యోగాన్ని సాధించడం సులభమేనన్న ఆమె.. ఇలాంటి రాజకీయాల మధ్య నెగ్గుకు రావడం ఎంతో కష్టమని తెలిపారు. కాంగ్రెస్ తనతో రాజకీయాలు చేస్తున్నదని ధ్వజమెత్తారు. తనకు నమ్మక ద్రోహం చేసిన కాంగ్రెస్లో ఇకపై తాను కొనసాగలేనన్న ఆమె.. తన ఉద్యోగం తనకు కావాలన్నారు.