PM Modi | న్యూఢిల్లీ, ఫిబ్రవరి 24: చైనాతో పోరాటంలో గెలవలేమంటూ విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ చేసిన బేల ప్రకటనపై విశ్రాంత సైనికాధికారులు అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. ఎన్నికల సమయంలో తమలాంటి దేశభక్తులే లేరని చేసిన ప్రకటనలు ఏమయ్యాయని నిలదీస్తున్నారు. దేశ శక్తికి ఆర్థిక వ్యవస్థే ప్రామాణికమైతే అమెరికాతో క్యూబా దశాబ్దాలపాటు ఎలా పోరాడిందని మాజీ నేవీ చీఫ్ అరుణ్ప్రకాశ్ ప్రశ్నించారు. ‘రెండు దేశాల మధ్య సంబంధాలను ఆ దేశాల ఆర్థిక వ్యవస్థలే నిర్ణయిస్తాయనుకొంటే అమెరికా వంటి అగ్రరాజ్యాన్ని క్యూబా, ఉత్తర కొరియా, ఇరాన్ వంటి చిన్న దేశాలు ఎలా ఎదిరించి నిలబడ్డాయి? భారత్ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం, అణ్వాయుధ సామర్థ్యమున్న దేశం, స్థిరమైన ఆర్థిక వ్యవస్థ ఉన్న మనం ఆధిపత్య వాదులకు వ్యతిరేకంగా బలంగా నిలబడాలి’ అని సూచించారు.
జైశంకర్ ప్రకటన చైనాకు భారత్ బేషరతుగా లొంగిపోయినట్టుగా అర్థాన్నిస్తున్నదని రిటైర్డ్ లెఫ్ట్నెంట్ జనరల్ అనిల్ దుహూన్ మండిపడ్డారు. ‘ఎన్నికల సమయంలో బీజేపీ చూపించిన కండలు తిరిగిన జాతీయవాదం ఎటుపోయింది? మోదీ స్వీయ ప్రకటిత జాతీయవాదం నేడు చైనా దూకుడు ముందు మోకరిల్లిందా? చొరబాట్లపై చైనాకు మోదీజీ ఇప్పటికే క్లీన్చిట్ ఇచ్చేశారుగా! 56 ఇంచుల ఛాతి వ్యక్తి ఆ దేశానికి భయపడ్డారా?’ అని ట్వీట్ చేశారు. జైశంకర్ ఓటమి ప్రకటన చైనాపై మోదీ విధానాన్ని సూచిస్తున్నదని మండిపడ్డారు. కయ్యానికి కాలుదువ్వుతున్నది భారత్ కాదని, చైనా అన్న సంగతి జైశంకర్ తెలుసుకొంటే మంచిదని రిటైర్డ్ మేజర్ జనరల్ శైల్ ఝా సూచించారు. ‘ఎకానమీ పెద్దదా? చిన్నదా? అన్నది విషయం కాదు. బెదిరింపులకు మనం లొంగిపోతే మన ఆత్మగౌరవాన్ని కోల్పోయినట్టే.. అది మీకు ఆమోదయోగ్యమేనా? సిగ్గుచేటు.. ఈ విదేశాంగమంత్రి చాలా గొప్పోడే’ అని ఎద్దేవా చేశారు.