గువాహటి: గజరాజులకు (Elephants) ఆకలేది. దీంతో గుట్టల్లో ఉన్న అవి ఆహారం కోసం వెతుక్కుంటూ వచ్చాయి.. ఓ కుంటలో నీళ్లు కనిపించడంతో సేదతీరుదామని అందులోకి దిగాయి. కాసేపటి తర్వాత అందులోనుంచి బయటకు వెల్దామని ప్రయత్నిస్తే కాళ్లు పైకి రావడం లేదు.. దీంతో అరవడం మొదలుపెట్టాయి.. అది విన్న స్థానికులు అటవీ సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అంతా కలిసి వాటిని రక్షించారు. అసోంలోని గోల్పారా జిల్లాలో ఇది జరిగింది.
గోల్పారా జిల్లాలోని లఖీపూర్ సమీపంలో అటవీ ప్రాంతం ఉన్నది. సమీపంలో ఉన్న మేఘాలయన్ కొండల్లో నుంచి పది ఏనుగులు ఆహారం కోసం వెతుక్కుంటూ వచ్చాయి. అయితే అక్కడ ఓ బురద కుంటలో నీళ్లు కనిపించడంతో తాగడానికి అందులోకి దిగాయి. కొద్దిసేపటి తర్వాత అందులోనుంచి బయటకు రావాలని ఎంత ప్రయత్నించినా కుదర్లేదు. వాటి కాళ్లు బురదలో కూరుకుపోయాయి. ఏనుగుల అరుపులు విన్న స్థానికులు పోలీసుల, అటవీ సిబ్బందికి సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు స్థానికులు, జేసీబీల సహాయంతో రెండు గంటలపాటు శ్రమించి బయటకు తీశారు.
మొత్తం పది ఏనుగులు బురదలో కూరుకుపోయాయని, కష్టంగా నాలుగు బయటకు వచ్చాయని అధికారులు తెలిపారు. మరో ఆరు ఏనుగులను రెండు గంటలపాటు కష్టపడి అందులోనుంచి తీశామన్నారు. వాటిలో ఒక ఏనుగు పిల్ల కూడా ఉందని చెప్పారు.