Viral News | కోల్కతా, నవంబర్ 27: మూడు ఏనుగులు చనిపోవడానికి కారణమైందని పశ్చిమ బెంగాల్ అలీపూర్దార్ జిల్లా అటవీ శాఖ అధికారులు సోమవారం ఓ గూడ్స్ రైలును సీజ్ చేశారు. రాజభట్ఖావా అటవీ ప్రాంతంలో రైల్వే క్రాసింగ్ వద్ద ఏనుగులు రైలు పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగిందని, ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టినట్టు అలీపూర్దార్ జిల్లా అధికారులు తెలిపారు. ‘గూడ్స్ రైల్ను అటవీ శాఖ భౌతికంగా స్వాధీనం చేసుకోలేదు.
సాంకేతికంగా రైలును సీజ్ చేశాం. దీనికి సంబంధించి పత్రాల్ని సిద్ధం చేశాం. ప్రస్తుతం రైలు ప్రమాద ఘటన వద్దే ఆగిపోయింది’ అని చీఫ్ వైల్డ్లైఫ్ వార్డెన్ దేబల్ రాయ్ చెప్పారు. ‘ఇలాంటి ప్రమాదాల్ని నివారించే ఐడీఎస్ సాంకేతిక వ్యవస్థ పరిధిలో రాజభట్ఖావా-కలాచీ సెక్షన్ లేదు. ఐడీఎస్ పరిధి ఉన్న ప్రాంతాల్లో ఎక్కడా కూడా ఇలాంటి ప్రమాదాలు జరగలేదు’ అని నార్త్ఈస్ట్ ఫ్రాంటియర్ రైల్వే సీనియర్ అధికారి ఒకరు వెల్లడించారు.