న్యూఢిల్లీ, మే 4: కరోనా సెకండ్ వేవ్ విజృంభణతో దేశ ఆరోగ్య వ్యవస్థ తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. దవాఖానల్లో ఆక్సిజన్, వైద్య పరికరాలు తగినన్ని లేకపోవడంతో వందలాది మంది పిట్టల్లా రాలిపోతున్నారు. దేశ పరిస్థితులకు చలించి మానవత్వంతో స్పందించిన పలు దేశాలు.. వేలాది ఆక్సిజన్ సిలిండర్లు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, రెమ్డెసివిర్ వంటి ఔషధాలను భారత్కు పంపించాయి. గత వారం రోజుల్లో 25 విమానాల్లో రాజధాని ఢిల్లీకి 300 టన్నుల విలువైన అత్యవసర కొవిడ్-19 సామగ్రి చేరుకున్నది. అయితే, ఇప్పుడు ఆ సామగ్రి ఎక్కడికి వెళ్లిందో అంతుచిక్కడం లేదు.
ఏప్రిల్ 25న సింగపూర్ నుంచి వైద్య సామగ్రి ఢిల్లీ విమానాశ్రయం చేరింది. ఆ తర్వాత పలు దేశాలు పంపిన సామగ్రి కూడా వచ్చింది. అయితే దీన్ని రాష్ర్టాలకు పంపిణీ చేయడానికి అవసరమైన స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ (ఎస్ఓపీ)ను కేంద్ర ప్రభుత్వం సిద్ధం చేయలేదు. ఏడు రోజుల తర్వాత అంటే మే 2న ఈ నిబంధనలు తయారు చేసిన కేంద్రం.. ఎయిర్పోర్టు అధికారుల నుంచి సామగ్రిని తీసుకునే బాధ్యతను ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీకి అప్పగించింది. పరిమితమైన వనరులు ఉండటంతో.. కేంద్రం సూచనలతో.. సామగ్రి పంపిణీ, భద్రపర్చడం వంటి పనుల కోసం భారత ప్రభుత్వ సంస్థ ‘హెచ్ఎల్ఎల్ లైఫ్కేర్ (హెచ్ఎల్ఎల్) లిమిటెడ్’ సేవలను రెడ్క్రాస్ సొసైటీ వినియోగించుకుంటున్నది. హెచ్ఎల్ఎల్ గోడౌన్లో నిల్వ చేసిన సామగ్రిలో కొంత మొత్తంలో సామగ్రి ఇప్పటికే పంపిణీ జరిగిందని, అయితే, అది ఎక్కడికి పంపారో తమకు తెలియదని రెడ్క్రాస్ సొసైటీకి చెందిన ఒక అధికారి తెలిపారు. ఈ సామగ్రి తమకు అందలేదని రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నాయి. విదేశాలు పంపిన వైద్య సామగ్రి పంపిణీలో పారదర్శకత లోపించడంతో కేంద్ర ప్రభుత్వ వైఖరిపై పలువురు మండిపడుతున్నారు. వైద్య సామగ్రి ఢిల్లీ ఎయిర్పోర్ట్ చేరే వరకు పూర్తి సమాచారం అందుబాటులో ఉన్నది. ఆ తర్వాత ఆ సామగ్రి ఏమైందో అర్థం కావడంలేదని అంటున్నారు.
కొరతతో దవాఖానలో పేషంట్ల మృతి
ఢిల్లీలోని బాత్రా దవాఖానలో ఆక్సిజన్ కొరత నెలకొనడంతో మే 1న 12 మంది మరణించారు. ఇందులో ఒక సీనియర్ వైద్యుడు కూడా ఉన్నారు. అయితే, బ్రిటన్ పంపిన 500 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు, ఐర్లాండ్ పంపిన 700 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఏప్రిల్ 30 (ఘటన జరిగే కంటే ముందురోజు) ఢిల్లీ ఎయిర్పోర్టుకు చేరుకున్నాయి. ఆ సామగ్రిలో కొంత బాత్రా దవాఖానకు తరలించినా 12 నిండు ప్రాణాలు దక్కేవి.
చెన్నై, మే 4: కరోనా సంక్షోభంలో చిక్కుకున్న భారత్కు బ్రిటన్ విరాళంగా ఇచ్చిన దాదాపు 35 టన్నుల వైద్య, చికిత్స సామగ్రి మంగళవారం వేకువజామున చెన్నై చేరుకున్నది. భారత వాయుసేనకు చెందిన సరుకు రవాణా విమానం సీ-17 గ్లోబ్మాస్టర్ తీసుకొచ్చిన ఈ సామగ్రిలో 450 ఖాళీ ఆక్సిజన్ సిలిండర్లు కూడా ఉన్నట్టు అధికారులు తెలిపారు. భారత్ కోసం బ్రిటన్ ఇప్పటికే 5 వేల ఆక్సిజన్ సిలిండర్లను విరాళంగా ఇచ్చిందని, ఇందులో 900 సిలిండర్లను తమిళనాడుకు కేటాయించనున్నట్టు రెడ్క్రాస్ సొసైటీ వెల్లడించింది.
విరాళంగా వచ్చిన విదేశీ వైద్య పరికరాలపై కేంద్రం ప్రకటన
న్యూఢిల్లీ, మే 4: దేశంలో కొవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో విదేశాలు విరాళంగా పంపిన ‘కొవిడ్-19 సామగ్రి’ని రాష్ర్టాలకు సరఫరా చేయకుండా మీనమేషాలు లెక్కిస్తున్న కేంద్ర ప్రభుత్వంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీంతో ప్రభుత్వం నష్టనివారణ చర్యలకు ఉపక్రమించింది. విదేశాలు పంపిన వైద్య సామగ్రిని వివిధ రాష్ర్టాలు/కేంద్రపాలిత ప్రాంతాలకు సరఫరా చేస్తున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ మంగళవారం తెలిపింది. రాష్ర్టాల అవసరాన్ని బట్టి ఈ సామగ్రిని పంపిణీ చేస్తున్నట్టు వెల్లడించింది. దాదాపు 40 లక్షలకు పైగా వైద్య పరికరాలు కలిగిన ఈ సామగ్రిని 24 విభాగాలుగా విభజించామని, ఆయా రాష్ర్టాల్లో ఉన్న 38 కేంద్ర ప్రభుత్వ సంస్థల (ఎయిమ్స్, డీఆర్డీవో ఆరోగ్య కేంద్రాలు తదితరాలు) ద్వారా వీటిని సరఫరా చేస్తున్నట్టు ఒక ప్రకటనలో వివరించింది.