Maharashtra | (స్పెషల్ టాస్క్ బ్యూరో) హైదరాబాద్, సెప్టెంబర్ 12 (నమస్తే తెలంగాణ): బీజేపీ పాలిత మహారాష్ట్రలో రైతన్నల మృత్యుఘోష నిత్యం వినిపిస్తున్నది. వందలాది మంది అన్నదాతలు ఆత్మహత్యలు చేసుకొంటున్నారు. పంట నష్టాలు, అప్పుల బాధతోపాటు కష్ట సమయాల్లో ప్రభుత్వం అండగా నిలబడకపోవడంతో రైతులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు. రాష్ట్రంలో సాగునీటి సదుపాయం పెద్దగా లేని మరాఠ్వాడా రీజియన్లో అయితే పరిస్థితి మరీ దారుణంగా ఉన్నది. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఆగస్టు 31 వరకు ఎనిమిది నెలల వ్యవధిలో మరాఠ్వాడా ప్రాంతంలో ఏకంగా 685 మంది రైతులు ఆత్మహత్య చేసుకొన్నారు.
మరాఠ్వాడా రీజియన్లో చోటుచేసుకొన్న జరిగిన ఆత్మహత్యల్లో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రిగా ఉన్న ధనంజయ్ ముండే సొంత జిల్లా బీడ్లోనే అత్యధికంగా 186 మంది రైతులు ప్రాణాలు తీసుకొన్నారు. తర్వాతి స్థానాల్లో ఉస్మానాబాద్(113), నాందేడ్(110) ఉన్నాయి. ఈ మేరకు ఔరంగాబాద్ డివిజనల్ కమిషనర్ కార్యాలయం తాజా గణాంకాలు వెల్లడించాయి. జూన్ నుంచి ఆగస్టు మధ్య రుతుపవనాల మూడు నెలల కాలంలో 294 మంది అన్నదాతలు ఉసురు తీసుకొన్నారని తెలిపాయి.
20.7 శాతం లోటు వర్షపాతం
మహారాష్ట్రలోని ఔరంగాబాద్, జాల్నా, బీడ్, పర్భని, నాందేడ్, ఉస్మానాబాద్, హింగోలి, లాతూర్ జిల్లాలను కలిపి మరాఠ్వాడా ప్రాంతంగా పిలుస్తారు. ఈ రీజియన్లో ప్రస్తుతం 20.7 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఈ ప్రాంతంలో రుతుపవన కాలంలో సగటు వర్షపాతం 574.4 మిల్లీమీటర్లు ఉండగా, ఈ సీజన్లో సెప్టెంబర్ 11 వరకు 455.4 మిల్లీమీటర్ల వర్షపాతం మాత్రమే కురిసిందని ఓ అధికారి పేర్కొన్నారు.