న్యూఢిల్లీ: ఓవర్ టేక్ చేసేందుకు బైక్కు దారి ఇవ్వలేదన్న కోపంతో క్యాబ్ డ్రైవర్ను కత్తితో పొడిచి హత్య చేశారు. (Cab driver stabbed ) ఈ సంఘటన కలకలం రేపింది. దేశ రాజధాని ఢిల్లీలో ఈ దారుణం జరిగింది. సంగం విహార్ ప్రాంతానికి చెందిన మనోజ్ కుమార్ గురుగ్రామ్లోని ఒక కంపెనీలో క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం మాల్వియా నగర్ నుంచి ఐదుగురు ఉద్యోగులను కారులో ఎక్కించుకున్నాడు. మరో ఉద్యోగి పికప్ కోసం మెహ్రౌలీకి వెళ్తుండగా రాత్రి 8.40 గంటల సమయంలో ట్రాఫిక్ జామ్లో కారు చిక్కుకుంది.
కాగా, బైక్పై వెళ్తున్న ముగ్గురు యువకులు ఓవర్ టేక్ కోసం దారి ఇవ్వాలని క్యాబ్ డ్రైవర్ మనోజ్ను అడిగారు. అయితే బైక్ వెళ్లే గ్యాప్ లేకపోవడంతో దీనికి నిరాకరించాడు. ఈ నేపథ్యంలో బైక్పై ఉన్న ముగ్గురు అతడితో గొడవపడ్డారు. ఈ ఘర్షణలో ఒక వ్యక్తి కత్తితో మనోజ్ ఛాతిపై పొడిచాడు. అనంతరం వారు అక్కడి నుంచి బైక్పై పారిపోయారు.
మరోవైపు కత్తి దాడిలో తీవ్రంగా గాయపడిన క్యాబ్ డ్రైవర్ మనోజ్ను స్థానికులు వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలో అతడు మరణించాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు ఈ సంఘటనపై కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. మైనర్ అయిన ఒక నిందితుడ్ని గుర్తించి అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు నిందితుల కోసం పోలీసులు వెతుకుతున్నారు.