న్యూఢిల్లీ: ప్రికాషన్ డోసు తీసుకునేవారు కొత్తగా రిజస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. నేరుగా అపాయింట్మెంట్ తీసుకోవచ్చని వెల్లడించింది. ‘ప్రికాషన్ డోసు షెడ్యూల్ శనివారం విడుదల చేస్తాం. ఆన్లైన్ అపాయింట్మెంట్ కూడా శనివారం సాయంత్రం నుంచి ప్రారంభమవుతుంది. టీకా కేంద్రాల్లో స్పాట్ అపాయింట్మెంట్ సోమవారం నుంచి మొదలవుతుంది’ అని వివరించింది.
దేశంలో కరోనాతో 32 లక్షల మరణాలు!
దేశంలో కరోనా మహమ్మారి కారణంగా గతేడాది సెప్టెంబర్ నాటి వరకు దాదాపు 32 లక్షల మంది మరణించి ఉండొచ్చని, ఇది అధికారిక గణాంకాల కంటే ఆరేడు రెట్లు అధికంగా ఉంటుందని తాజా అధ్యయనం వెల్లడించింది.ఒక స్వతంత్ర, రెండు ప్రభుత్వ డాటా వనరుల ఆధారంగా కెనడాకి చెందిన టొరంటో యూనివర్సిటీ ప్రొఫెసర్ ప్రభాత్ఝా నేతృత్వంలోని అంతర్జాతీయ పరిశోధకుల బృందం ఈ అధ్యయనం చేసింది.
రుతుక్రమంపై టీకా ఎఫెక్ట్ ఏం లేదు
మహిళల రుతుక్రమంపై కొవిడ్ వ్యాక్సిన్ ప్రతికూల ప్రభావం చూపదని శాస్త్రవేత్తల అధ్యయనంలో తేలింది. రుతుక్రమంపై వ్యాక్సిన్ ప్రభావం తెలుసుకొనేందుకు అమెరికాలో 4 వేల మందిపై అధ్యయనం జరిపారు. టీకా వేసుకొన్న తర్వాత 6 నెలల దాకా వీరి రుతుక్రమాన్ని గమనించారు. వ్యాక్సిన్ తీసుకొన్న తర్వాత మొదటి నెలసరి ఒకటి రెండు రోజులు ఆలస్యంగా వచ్చిందని, తర్వాత వ్యాక్సిన్ ప్రభావం ఏమీ కనిపించలేదని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.
మరో విమానంలో 173 మందికి కరోనా
ఇటలీలోని రోమ్ నుంచి అమృత్సర్కు శుక్రవారం చార్టర్డ్ విమానంలో వచ్చిన 173 మంది ప్రయాణికులకు కొవిడ్ పాజిటివ్గా నిర్ధారణ అయింది. గురువారం ఇటలీలోని మిలాన్ నుంచి ప్రత్యేక విమానంలో అమృత్సర్ ఎయిర్పోర్టులో దిగిన ప్రయాణికుల్లో కూడా 125 మందికి కరోనా సోకినట్లు పరీక్షల్లో తేలింది.
ఈ నెలాఖరుకు పీక్స్టేజ్
దేశంలో ఈ నెలాఖరుకు కరోనా కేసులు పీక్ స్టేజ్కు చేరుకుంటాయని ఐఐటీ కాన్పూర్కు చెందిన ప్రొఫెసర్ మణీంద్ర అగర్వాల్ తెలిపారు. రోజుకు 4-8 లక్షల కేసులు నమోదు కావొచ్చని అంచనావేశారు.