బెంగళూరు: ఫుడ్ డెలివరీ ఏజెంట్పై (food delivery agent) ఒక బాలిక ఫిర్యాదు చేసింది. అతడు తనను టెర్రస్ పైకి తీసుకెళ్లినట్లు ఆరోపించింది. దీంతో ఫుడ్ డెలివరీ వ్యక్తిని స్థానికులు కొట్టారు. చివరకు అసలు విషయం తెలుసుకుని కంగుతిన్నారు. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఈ సంఘటన జరిగింది. అపార్ట్మెంట్ సముదాయంలో నివసించే ఒక కుటుంబానికి చెందిన 8 ఏళ్ల బాలిక సోమవారం ఉదయం కనిపించకుండా పోయింది. తల్లిదండ్రులు వెతకగా చివరకు టెర్రస్పై కనిపించింది. అయితే పేరెంట్స్ మందలిస్తారని భయపడిన ఆ బాలిక అబద్ధం చెప్పింది. ఫుడ్ డెలివరీ వ్యక్తి తనను టెర్రస్పైకి తీసుకెళ్లినట్లు ఆరోపించింది. దీంతో అతడి చెయ్యి కొరికి తప్పించుకున్నట్లు చెప్పింది. అపార్ట్మెంట్ సముదాయం వద్ద ఉన్న ఫుడ్ డెలివరీ వ్యక్తి వైపు వేలు చూపించి ఈ కట్టుకథ అల్లింది.
కాగా, ఆగ్రహించిన బాలిక తల్లిదండ్రులు వెంటనే సెక్యూరిటీ గార్డులను అలెర్ట్ చేశారు. దీంతో వారు గేట్లను మూసివేశారు. అపార్ట్మెంట్ వాసులు, గార్డులు కలిసి ఫుడ్ డెలివరీ వ్యక్తిని కొట్టారు. అనంతరం పోలీసులకు సమాచారం ఇచ్చారు. అక్కడకు చేరుకున్న పోలీసులు ఆరా తీశారు. అయితే తాను ఏ తప్పు చేయలేదని, తనకు ఏమీ తెలియదని ఫుడ్ డెలివరీ వ్యక్తి చెప్పాడు. ఈ నేపథ్యంలో పోలీసులు అక్కడి సీసీటీవీ ఫుటేజ్ను పరిశీలించారు. బాలిక ఒంటరిగానే టెర్రస్పైకి వెళ్లినట్లు తెలుసుకున్నారు.
మరోవైపు మరో కుమార్తెను స్కూల్ బస్సు ఎక్కించేందుకు తండ్రి వెళ్లిన సందర్భంగా ఆ బాలిక టెర్రస్ మీదకు ఎక్కింది. అయితే ఆమె కనిపించకపోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు అంతా వెతికారు. చివరకు 30 నిమిషాల తర్వాత ట్రెరస్పై ఆమెను గుర్తించారు. అయితే అప్పుడే అపార్ట్మెంట్ వద్దకు వచ్చిన ఫుడ్ డెలివరీ వ్యక్తిని ఆ బాలిక చూసింది. ఆ వ్యక్తి తనను మేడపైకి తీసుకెళ్లినట్లు ఆరోపించింది. అయితే తండ్రికి భయపడే ఇలా అబద్ధం చెప్పినట్లు ఆ బాలిక పోలీసులకు చెప్పింది. దీంతో ఫుడ్ డెలివరీ వ్యక్తిని కొట్టిన అపార్ట్మెంట్ వాసులు, సెక్యూరిటీ గార్డులు ఇది తెలుసుకుని షాక్ అయ్యారు.
కాగా, కొట్టిన వారిపై ఫిర్యాదు చేస్తావా? అని ఫుడ్ డెలివరీ వ్యక్తిని పోలీసులు అడిగారు. అయితే తాను ఎలాంటి కేసు నమోదు చేయనని అతడు చెప్పాడు. బాలిక తల్లిదండ్రుల పరిస్థితిని తాను అర్థం చేసుకోగలనని అస్సాంకు చెందిన ఆ వ్యక్తి అన్నాడు. అలాగే తాను త్వరలో బెంగళూరు విడిచి వెళ్లిపోతానని పోలీసులకు చెప్పాడు.