ఢిల్లీ : నగదు రహిత ఇన్సూరెన్స్ క్లెయిమ్లు తిరస్కరించిన బీమా కంపెనీలపై తక్షణమే చర్యలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆప్ ఇండియా(ఐఆర్డీఏఐ) కు సూచించింది. కొన్ని ఆస్పత్రులు క్యాష్లెస్ ఇన్సూరెన్స్ క్లెయిమ్లను తిరస్కరిస్తున్నట్టు తమ దృష్టికి వచ్చిందని మంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు ఐఆర్డీఏఐ జనరల్, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలకు సర్క్యూలర్ జారీ చేసింది.
ముఖ్యంగా కరోనా క్లైమ్ లను ప్రాధాన్యంగా తీసుకుని సత్వరమే సెటిల్ చేయాలని బీమా కంపెనీలను ఐఆర్డీఏఐ కోరినట్లు మంత్రి తెలిపారు. ఏవైనా ఆస్పత్రులు నగదు రహిత క్లెయిమ్ లను తిరస్కరిస్తే వెంటనే బీమా కంపెనీకు ఫిర్యాదు చేయాలని మంత్రి ప్రజలకు సూచించారు. ఈ ఏడాది ఏప్రిల్ 20 నాటికి 9 లక్షల కరోనా సంబంధిత ఇన్సూరెన్స్ క్లెయిమ్లను బీమా కంపెనీలు సెటిల్ చేశాయి. తద్వారా రూ.8,642 కోట్లు విడుదల చేశాయి.
గత సంవత్సరం మార్చిలోనే కరోనాను కూడా కాంప్రహెన్సివ్ హెల్త్ స్కీమ్లో చేర్చారు. తద్వారా నెట్వర్క్ ఆస్పత్రులతో పాటు తాత్కాలిక కొవిడ్ ఆస్పత్రుల్లోనూ క్యాష్లెస్ చికిత్స అందుబాటులోకి వచ్చింది. బీమా సంస్థలు నగదు రహిత సదుపాయాన్ని కల్పించడానికి ఆస్పత్రుల్లో ఓ ఏర్పాటును కలిగి ఉన్నాయని, అటువంటి నెట్వర్క్ ఆస్పత్రులు కొవిడ్ -19 చికిత్సతో సహా అన్ని చికిత్సలకు నగదు రహిత చికిత్సను అందించాల్సిన బాధ్యత ఉందని ఐఆర్డీఏఐ పేర్కొంది.
కరోనా మహమ్మారి వైద్య చికిత్సకు అయ్యే ఖర్చులకు సంబంధించి వ్యక్తిగతంగా లేదా కుటుంబం మొత్తానికి కలిపి రూ.5 లక్షల వరకు పాలసీ తీసుకోవచ్చు. మూడున్నర, ఆరున్నర, తొమ్మిదిన్నర నెలల కాల వ్యవధికి పాలసీని కొనుగోలు చేయొచ్చు. కరోనా కవచ్ పాలసీలను కొనుగోలు చేసే విండోను ఐఆర్డీఏఐ సెప్టెంబర్ 30వ తేదీ వరకు పొడిగించింది.