Himachal Pradesh | సిమ్లా/ డెహ్రాడూన్, ఆగస్టు 14: హిమాచల్ ప్రదేశ్లో వరదలు బీభీత్సం సృష్టిస్తున్నాయి. ఆకస్మిక వరదలు, కొండచరియల కారణంగా సోమవారం రాష్ట్రంలో 50 మందికిపైగా మృత్యువాతపడ్డారు. పొరుగున ఉన్న ఉత్తరాఖండ్ కూడా భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలం అవుతున్నది. వర్షాల ధాటికి రాష్ట్రంలో నలుగురు ప్రాణాలు కోల్పోగా మరో 9 మంది గల్లంతయ్యారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలను ముమ్మరం చేశాయి.
గుడిలోనే సజీవ సమాధి
హిమాచల్ రాజధాని సిమ్లాలో సోమవారం కొండ చరియలు పడి శివాలయం కూలిపోవడంతో శ్రావణ మాస పూజలు చేస్తున్న భక్తులు సజీవ సమాధి అయ్యారు. ఇప్పటివరకు 9 మృత దేహాలను వెలికితీశారు. శిథిలాల కింద మరో 25 మంది చనిపోయి ఉంటారని భావిస్తున్నారు. సిమ్లాలోనే మరోచోట కొండ చరియలు విరిగి పడటంతో అయిదుగురు దుర్మరణం చెందారు. 17 మందిని అధికారులు రక్షించారు. తుఫాను ధాటికి సోలాన్ జిల్లాలో ఒకే కుటుంబానికి చెందిన ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఇదే జిల్లాలో మరో ఘటనలో ఇండ్లు కూలడంతో ఇద్దరు చిన్నారులు ప్రాణాలు వదిలారు. పలు జిల్లాల్లో ఇండ్లు కూలిపోయాయి. రాష్ట్ర వ్యాప్తంగా 752 రోడ్లు దెబ్బ తినడంతో రాకపోకలు స్తంభించాయి. 621 రోడ్లను మూసేశారు. వాతావరణ శాఖ 12 జిల్లాలకు గురువారం వరకు భారీ వర్షాలతో కూడిన యెల్లో వార్నింగ్ జారీ చేసింది. విద్యా సంస్థలకు ప్రభుత్వాలు సోమవారం సెలవులు ప్రకటించాయి. యునెస్కో వారసత్వ ప్రదేశంగా గుర్తింపు పొందిన షిమ్లా-కల్కా రైల్వే లైను వర్షాల ధాటికి మట్టి కొట్టుకుపోయి గాల్లో వేలాడుతున్నది.
కుప్పకూలిన డిఫెన్స్ కాలేజ్ భవనం
గంగా, అలకనంద, మందాకిని నదులు ప్రమాదకర స్థాయి దాటి ప్రవహిస్తున్నాయని అధికారులు వెల్లడించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం హరిద్వార్ వద్ద గంగా నది 294.90 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తున్నది. వర్షాల కారణంగా ఉత్తరాఖండ్లోని డెహ్రాడూన్లో రక్షణ శిక్షణ కేంద్రం కూలిపోయింది. రాష్ట్రంలోని ప్రధాన జాతీయ రహదారులు దెబ్బ తిన్నాయి. కొండ చరియలు విరిగిపడటంతో పౌరి జిల్లాలో అయిదుగురు గల్లంతయ్యారు. ఈ సీజన్లో వర్షాలు, కొండ చరియలు విరిగి పడటం వల్ల రూ.7020.28 కోట్ల నష్టం వాటిల్లిందని హిమాచల్ రాష్ట్ర అధికారులు తెలిపారు.
టన్నెల్లో చిక్కుకుపోయి..తాడు సాయంతో బయటపడి
ఉత్తరాఖండ్లో భారీ వర్షాల కారణంగా నదులు, వాగులు పొంగి ప్రవహిస్తున్నాయి. రిషికేశ్-కర్ణప్రయాగ్ రైల్వే లైన్ ప్రాజెక్ట్ టన్నెల్లోకి వరద నీరు చేరడంతో 114 మంది కార్మికులు లోపలే చిక్కుకుపోయారు. వెంటనే పోలీసులు స్పందించి తాడు సాయంతో వారందరినీ రక్షించారు. మధ్యమాహేశ్వర్ లోయలో వంతెన కూలిపోవడంతో యాత్రికులు ఒకవైపు చిక్కుకుపోయారు. వర్షాల దెబ్బకు చాలా ప్రాంతాల్లో పంటలు దెబ్బ తిన్నాయి. హరిద్వార్ జిల్లాలో 24 గ్రామాల్లోకి వరద నీరు ప్రవేశించింది.
చార్ధామ్ యాత్ర నిలిపివేత
వర్షాల కారణంగా రోడ్లు తెగిపోవడంతో, కొండ చరియలు విరిగి పడటంతో చార్ధామ్ యాత్రను సోమవారం నుంచి రెండు రోజుల పాటు తాత్కాలికంగా నిలిపేసినట్టు అధికారులు వెల్లడించారు. చార్ధామ్ యాత్రకు వెళ్లే జాతీయ రహదారులన్నీ బ్లాక్ అయ్యాయని వారు తెలిపారు.