వేములవాడ: గల్ఫ్ దేశాల్లో యుద్ధ జ్వాలలు ఎగిసి పడుతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధంతో బాంబుల మోత మోగుతున్నది. యూఏఈ, కువైట్, ఖతార్, బహ్రెయిన్, ఇరాక్ దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలతోపాటు విమానాశ్రయాలు, ఇతర సముదాయాలను లక్ష్యంగా చేసుకొని ఇరాన్ క్షిపణుల దాడి చేస్తుండగా, ఆయా దేశాలతోపాటు సమీప దేశాల్లోని వలస జీవులు బిక్కుబిక్కుమంటున్నారు. నిత్యం బాంబుల మోతలతో దేశాలు దద్దరిల్లుతుండగా, పొట్ట చేత పట్టుకొని ఉపాధి కోసం గల్ఫ్ దేశాలు వెళ్లిన లక్షలాది మంది ఉమ్మడి కరీంనగర్ జిల్లావాసులు ఏక్షణం ఏం జరుగుతుందో తెలియక భయాందోళన మధ్య గడుపుతున్నారు. మరోవైపు ఇక్కడ వారి కుటుంబసభ్యులు ఆందోళనకు గురవుతున్నారు. భారత ప్రభుత్వం జోక్యం చేసుకుని భారతీయులను సురక్షితంగా స్వదేశం రప్పించేందుకు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
సైరన్ ద్వారా అప్రమత్తం
ఖతార్లోని సన్నాయి ప్రాంతంలో మేం ఉన్నం. సుమారు 7 కిలోమీటర్ల దూరంలో అమెరికా ఆర్మీ బేస్ క్యాంపు ఉన్నది. దాని లక్ష్యంగా ఇప్పటికే రెండు రోజుల్లో పదిసార్లు వైమానిక దాడులు చేసిన్రు. దాడి జరిగిన ప్రతిసారి భారీ శబ్దాలు వస్తున్నయి. దాడులను ఖతార్ సైన్యం కూడా నియంత్రిస్తున్నది. అయినా దాడులు జరుగుతూనే ఉన్నయి. ప్రభుత్వం ప్రజలను సైరన్ ద్వారా అప్రమత్తం చేస్తున్నది. బయటకు వెళ్లడానికి వీలు లేకుండా ఆదేశాలు జారీ చేసిన్రు. అందరం కలిసి ఒకచోట ధైర్యంగా ఉంటున్నం. – మొగిలి శంకర్, ఖతార్ (అచ్చన్నపేట)
పెద్ద పెద్ద శబ్దాలు వినబడుతున్నయ్
ఒమన్ దేశంలోని ముసందం రాష్ట్రంలో మేము పనిచేస్తున్నం. ఈ రాష్ట్రం దుబాయ్ రసల్ కీమాకు చాలా దగ్గరగా ఉంటుంది. దుబాయ్ లక్ష్యంగా జరుగుతున్న దాడులు మాకు వినిపిస్తున్నయి. ఆదివారం తెల్లవారుజామున మేం ఉండే ప్రాంతంలోని సముద్ర తీరాన షిప్ యార్డ్లో బాంబు పడింది. ప్రత్యక్షంగా మా దేశంపై ఎలాంటి దాడులు లేవు. పెద్దపెద్ద శబ్దాలు వినబడుతున్నయి.
– లకే నర్సయ్య, ఒమన్ (అచ్చన్నపేట – వేములవాడ రూరల్ మండలం)