తిరువనంతపురం: కరోనా నూతన వేరియంట్ ఒమిక్రాన్ ( Omicron Variant ) దాదాపుగా దేశంలోని అన్ని రాష్ట్రాలకు విస్తరించింది. అయితే మహారాష్ట్ర, ఢిల్లీల్లో ఒమిక్రాన్ కేసులు ఎక్కువగా ఉన్నాయి. ఇటీవల కేరళలో కూడా ఒమిక్రాన్ వేరియంట్ చాపకింద నీరులా విస్తరిస్తున్నది. ఇవాళ కూడా కేరళలో కొత్తగా ఐదు ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. దాంతో అక్కడ మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 29కి పెరిగింది. కేరళ ఆరోగ్యశాఖ మంత్రి వీణజార్జి గురువారం మధ్యాహ్నం ఈ వివరాలను మీడియాకు వెల్లడించారు.
కొత్తగా నమోదైన ఐదు కేసులలో ఇద్దరు యూకే నుంచి, ఒకరు అల్బేనియా నుంచి, మరొకరు నైజీరియా నుంచి ఎర్నాకుళం వచ్చారని వీణాజార్జి తెలిపారు. మరొకరు బెంగళూరు నుంచి కోజికోడ్ వచ్చారన్నారు. ప్రస్తుతం ఆ ఐదుగురు ఆస్పత్రిలో క్వారెంటైన్లో ఉన్నారని చెప్పారు. స్థానిక వైద్యాధికారులు వారి ప్రాథమిక కాంటాక్టులను గుర్తించి కరోనా పరీక్షలు చేసే పనిలో ఉన్నారని ఆమె వెల్లడించారు.