ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా అసోంను వరదలు ముంచెత్తుతున్నాయి. ఇప్పటివరకూ 32 జిల్లాల్లోని 31 లక్షల మందిపై వరదల ప్రభావం పడింది . శనివారం ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయారు. మృతుల సంఖ్య 63కు చేరింది. అత్యంత దారుణంగా దెబ్బతిన్న జిల్లాల్లో భారత సైన్యం సహాయక చర్యలు చేపట్టింది. ఇప్పటివరకూ మూడు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించింది. 514 సహాయ శిబిరాల్లో 1.56 లక్షల మంది ప్రజలు తలదాచుకున్నారు. ఇదిలా ఉండగా, గుహవటి నగర రోడ్లపైకి చేరుకున్న వరదనీటిలో చేపలు ఈతకొడుతున్నాయంటూ ఓ వీడియో నెట్టింట వైరల్గా మారింది. చివరికి ఇది ఫేక్ వీడియోగా తేలింది.
ఈ వీడియోలో ప్రధానరోడ్డుపై వరదనీటిలో చేపలు ఈతకొడుతున్నాయి. పెద్ద పెద్ద చేపలు ఈదుకుంటూ ముందుకు వెళ్తున్నాయి. ‘గువహటి పట్టణానికి వరదనీరు చేరుకుంది..రోడ్డుపై చేపలు ఈదుతున్నాయి.’ అని ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చారు. ట్విటర్, వాట్సాప్లో వీడియో చక్కర్లు కొట్టింది. అయితే, ఇది గువహటిలో కాదని, చైనాలోని గ్వాంగ్డాంగ్ రోడ్లపైన అని తేలింది. గ్వాంగ్డాంగ్ ప్రావిన్స్లో కొద్దిరోజులక్రితం వరదలు రాగా, రోడ్లపై చేపలు కనిపించాయి. ఈ వీడియో చైనా ట్విటర్లో కనిపించింది. దాన్నే ఎవరో గువహటిలో అంటూ ట్వీట్ చేయగా, వైరల్ అయ్యింది. విషయం తెలుసుకున్న చాలామంది నెటిజన్లు వెంటనే వారి ట్వీట్లను డిలీట్ చేశారు.
Fish on road of Guwahati. Assam flood reaches to city. pic.twitter.com/ZxBM6vO0H8
— sharmadivas (@sharmadivas) June 14, 2022