శ్రీనగర్ : స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా ప్రతి ఏడాది జమ్మూకశ్మీర్లో ఇంటర్నెట్ సేవలను నిలిపివేస్తారు. కానీ కశ్మీర్లో మూడేండ్ల తర్వాత తొలిసారిగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేయకుండా, ఎలాంటి ఆంక్షలు విధించకుండా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను నిర్వహించినట్లు పోలీసు అధికారులు పేర్కొన్నారు. ఈ మేరకు కశ్మీర్ ఐజీ విజయ్ కుమార్ ట్వీట్ చేశారు. ఇంటర్నెట్ సేవలు, మొబైల్ సేవలపై ఆంక్షలు విధించకుండా పంద్రాగస్టు వేడుకలు జరపడం.. మూడేండ్లలో ఇదే తొలిసారి అని తెలిపారు.
2005, ఆగస్టు 15న స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు నిర్వహిస్తున్న భక్షి స్టేడియం ప్రధాన ద్వారం వద్ద ఉగ్రవాదులు మొబైల్ ఫోన్ను ఉపయోగించి ఐఈడీ బాంబును పేల్చారు. అప్పట్నుంచి పంద్రాగస్టు వేడుకలకు పోలీసులు పటిష్ట బందోబస్తు కల్పిస్తూ.. ఉగ్రవాదుల కదలికలను ఎప్పటికప్పుడూ పసిగడుతూ చర్యలు తీసుకుంటున్నారు. అయితే ఆదివారం రోజు శ్రీనగర్ వ్యాప్తంగా ప్రజల కదలికలపై ఎలాంటి ఆంక్షలు విధించలేదని పోలీసులు తెలిపారు. సున్నితమైన ప్రాంతాల్లో బలగాలను మోహరించినట్లు పేర్కొన్నారు.