Fire Accident : మధ్యప్రదేశ్ (Madhyapradesh) లోని రత్లాం జిల్లా (Rathlam District) లో త్రివేండ్రం-హజరత్ నిజాముద్దీన్ రాజధాని ఎక్స్ప్రెస్ (Trivandrum-Hazrat Nizamuddin Rajdhani Express) లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఎసీ కోచ్ (AC Coach) నుంచి పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. రైల్వే సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలార్పుతున్నారు. ఆదివారం తెల్లవారుజామున కోటా రైల్వే డివిజన్ (Kota Railway Division) సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది.
రైలులోని ఏసీ కోచ్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అందులో 68 మంది ప్రయాణికులు ఉన్నారు. కంపార్ట్మెంట్ నుంచి పొగ, మంటలు రావడం గమనించిన రైల్వే గార్డ్ లోకోపైలట్ను అప్రమత్తం చేశారు. దాంతో రైలును అక్కడే నిలిపివేశారు. రైల్వే రక్షణ దళం (RPF) సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని బోగీల్లోని ప్రయాణికులను కిందకు దించారు. మంటలు అంటుకున్న బోగీలను రైలు నుంచి వేరుచేశారు. ఫైర్ ఇంజిన్లతో వాటిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఇప్పటివరకు ప్రాణనష్టానికి సంబంధించిన వివరాలు కూడా తెలియరాలేదు. ఘటన నేపథ్యంలో ఈ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ ప్రమాదంపై రైల్వేశాఖ ఉన్నతస్థాయి విచారణకు ఆదేశించింది.