న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలో వేర్వేరు చోట్ల భారీ అగ్ని్ ప్రమాదాలు జరిగాయి. ఢిల్లీలోని ఆనందర్ పర్వత్ పారిశ్రామిక వాడలో ఉన్న ఓ ఫ్యాక్టరీలో శనివారం ఉదయం 4.45 గంటల సమయంలో ఎల్పీజీ సిలిండర్ పేలింది. దీంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్రమంగా అవి ఫ్యాక్టరీ మొత్తం విస్తరించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. 10 ఫైర్ ఇంజిన్లతో మంటలు ఆర్పుతున్నారు. ఈ ప్రమాదంలో తొమ్మిది మంది కార్మికులు, ఆరుగురు అగ్నిమాపక సిబ్బంది గాయపడ్డారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించామని పోలీసులు తెలిపారు.
మరో ఘటనలో ఆజాద్ మార్కెట్ ఏరియాలో పలు షాపులు అగ్నికి ఆహుతయ్యాయి. మార్కెట్లో ఓ షాప్లో మంటలు చెలరేగాయని, తర్వాత అవి మరో మూడు షాపులకు వ్యాపించాయి. దీంతో భారీ ఎత్తున మంటలు ఎగసిపడ్డాయి. ఘటనా స్థలానికి చేరిన అగ్నిమాపక సిబ్బంది 20 ఫైర్ ఇంజిన్లతో మంటలను అదుపుచేశారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు.