కోల్కతా: అసెంబ్లీ ఆవరణలో జాతీయ గీతాన్ని అవమానించిన 12 మంది బెంగాల్ బీజేపీ ఎమ్మెల్యేలపై ఎఫ్ఐఆర్ నమోదైంది. వీరిలో అసెంబ్లీలో ప్రతిపక్ష నేత సువేందు అధికారి, పార్టీ చీఫ్ విప్ మనోజ్ టిగ్గా కూడా ఉన్నారు. వివిధ పథకాలకు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు రాకపోవడాన్ని నిరసిస్తూ అసెంబ్లీ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహం వద్ద బుధవారం ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సహా ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిరసన చేపట్టారు. వీరి ఆందోళన ముగుస్తున్న సమయంలో సువేందు అధికారి నేతృత్వంలోని బీజేపీ ఎమ్మెల్యేల బృందం మెగా ర్యాలీ కోసం అసెంబ్లీ ఆవరణకు చేరుకుంది.
నిరసన చేస్తున్న తృణమూల్ ఎమ్మెల్యేలను చూపిస్తూ ‘దొంగలు‘, ‘దొంగలు‘ అని నినాదాలు చేశారు. దీనిని తీవ్రంగా పరిగణించిన సీఎం మమత జాతీయ గీతాన్ని అవమానించారని స్పీకర్ బిమన్ బందోపాధ్యాయకు ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత ఆయన ఆదేశాలకు తోడు ముగ్గురు టీఎంసీ ఎమ్మెల్యేల ఫిర్యాదుతో 12 మంది బీజేపీ ఎమ్మెల్యేపై ఎఫ్ఐఆర్ నమోదైంది.