న్యూఢిల్లీ : ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ రాష్ట్రాలకు చెల్లించాల్సిన రూ 52,000 కోట్ల జీఎస్టీ పరిహారం పెండింగ్లో ఉందని ఆర్ధిక మంత్రిత్వ శాఖ సోమవారం పార్లమెంట్కు తెలిపింది. 2020-21, 2021-22 ఆర్ధిక సంవత్సరాలకు గాను రాష్ట్రాలకు వరుసగా రూ 1,10,208 కోట్లు, రూ 1.59 లక్షల కోట్లను రుణంగా సమకూర్చామని ఆర్ధిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్సభలో వెల్లడించారు.
ఈ ఏడాది సెప్టెంబర్ వరకూ రూ 52,000 కోట్ల జీఎస్టీ పరిహారం రాష్ట్రాలకు చెల్లించాల్సిఉందని చెప్పారు. జీఎస్టీ చట్టం ప్రకారం జీఎస్టీ అమలు ఫలితంగా రాష్ట్రాలు కోల్పోయిన ఆదాయాన్ని ఐదేండ్ల పాటు 2022 జూన్ వరకూ కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుంది. ఈ పరిహారాన్ని జీఎస్టీ అత్యధిక శ్లాబ్పై విధించే సెస్ ద్వారా సమకూరే కాంపెన్సేషన్ ఫండ్ నుంచి కేంద్రం రాష్ట్రాలకు అందిస్తుంది. 2017-18, 2018-19, 2019-20 ఆర్ధిక సంవత్సరాలకు రాష్ట్రాలకు జీఎస్టీ పరిహారం ఇప్పటికే చెల్లించామని కేంద్రం తెలిపింది.