న్యూఢిల్లీ: ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడానికి తీసుకొచ్చిన కొత్త పోర్టల్(income tax portal )లో ఎదురవుతున్న అవాంతరాలను ఇంకా పరిష్కరించని ఇన్ఫోసిస్పై ఆర్థిక శాఖ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ మేరకు వివరణ కోరుతూ ఇన్ఫోసిస్ ఎండీ, సీఈవో సలీల్ పరేఖ్కు ఆదివారం నోటీసులు జారీ చేసింది. జూన్ 7న కొత్త ఇన్కమ్ ట్యాక్స్ పోర్టల్ (www.incometax.gov.in)ను ప్రారంభించారు. అయితే రెండున్నర నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకూ ఇందులో ఏదో ఒక అవాంతరం ఎదురవుతూనే ఉంది. దీనిపై సోషల్ మీడియా వేదికగా ఎంతో మంది ట్యాక్స్ పేయర్లు ఫిర్యాదు చేశారు.
వీటిని పరిష్కరించాల్సిందిగా ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్.. ఇన్ఫోసిస్ను కోరారు. ఈ పోర్టల్ను మరింత యూజర్ ఫ్రెండ్లీగా చేయాలని ఆదేశించారు. యూజర్లకు పని సులువు చేయడానికి ఈ కొత్త పోర్టల్ తీసుకొచ్చినా.. ఇందులోని అవాంతరాలను వెంటనే పరిష్కరించాల్సిన అవసరం ఉన్నదని ఆర్థిక శాఖ స్పష్టం చేసింది. ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైలింగ్స్ను వేగిరం చేసి, రీఫండ్లను సాధ్యమైనంత త్వరగా ఇవ్వాలన్న ఉద్దేశంతో ఈ కొత్త పోర్టల్ తీసుకొచ్చారు. 2019లో దీని కాంట్రాక్ట్ను ఇన్ఫోసిస్ సొంతం చేసుకుంది.
యూజర్లకు ఎదురవుతున్న సాంకేతిక సమస్యలపై ఇన్ఫోసిస్ స్పందించింది. దీనిపై తాము పని చేస్తున్నామని, సాధ్యమైనంత త్వరగా పరిష్కరిస్తామని చెప్పింది. గత వారం వ్యవధిలో కొన్ని సమస్యలను పరిష్కరించినట్లు తెలిపింది. పోర్టల్లో ఇప్పటి వరకూ లక్ష ఐటీ రిటర్న్స్ దాఖలైనట్లు సంస్థ వెల్లడించింది.