2023 | న్యూఢిల్లీ, డిసెంబర్ 27: సరికొత్త ఆశలు, ఆకాంక్షలతో కొత్త సంవత్సరంలో అడుగు పెట్టేందుకు యావత్తు ప్రపంచం ఎదురుచూస్తున్నది. ఈ క్రమంలో ఒక్కసారి వెనక్కు తిరిగి చూసుకొంటే.. 2023 కొన్ని దేశాలకు విషాదాన్ని మిగిల్చింది. పలు దేశాల మధ్య యుద్ధాలు చెలరేగాయి. ఇదే సమయంలో మరికొన్ని దేశాలను ప్రకృతి విపత్తులు వణికించాయి. పలు దేశాల మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలకు ఈ ఏడాది సాక్ష్యంగా నిలిచింది. పాత ఏడాది ముగిసిపోయి, కొత్త సంవత్సరంలో అడుగు పెట్టబోతున్న క్రమంలో 2023లో ప్రపంచవ్యాప్తంగా జరిగిన కీలక ఘటనలు, పరిణామాలపై ఓసారి లుక్కేద్దాం..
ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం
2022లో రష్యా-ఉక్రెయిన్ మధ్య యుద్ధం ప్రారంభం కాగా.. ఇజ్రాయెల్-హమాస్(గాజా) మధ్య యుద్ధానికి 2023 సాక్ష్యంగా నిలిచింది. అక్టోబర్ 7న ఇజ్రాయెల్పై హమాస్ ఆకస్మిక దాడితో యుద్ధం చెలరేగింది. హమాస్ దాడులను సమర్థంగా తిప్పికొడుతూ వచ్చిన ఇజ్రాయెల్ సైన్యం.. ఏకంగా గాజా భూభాగంలోకి చొచ్చుకుపోయి హమాస్ మిలిటెంట్ల ఏరివేతకు గ్రౌండ్ ఆపరేషన్ చేపట్టింది. ఈ పోరులో రెండు వైపులా సైనికులతో పాటు దాదాపు 20 వేల మంది పౌరులు మరణించారు. యుద్ధంతో గాజా తీవ్రమైన మానవతా సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నది. ఆహారం, తాగునీరు, ఔషధాల కొరత ఏర్పడింది. మొత్తం ఆరోగ్య వ్యవస్థే కుప్పకూలడంతో దారుణ పరిస్థితులు నెలకొన్నాయి.
తుర్కియే, సిరియాలకు విషాద ఏడాది
2023, ఫిబ్రవరి 6.. తుర్కియే, సిరియాలకు ఒక చీకటి రోజు. రిక్టర్ స్కేల్పై 7.8, 7.5 తీవ్రతతో రెండు శక్తివంతమైన భూకంపాలు ఈ రెండు దేశాలను వణికించాయి. ఈ విషాద ఘటనలో 55 వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోగా.. లక్ష మందికి పైగా పౌరులకు గాయాలయ్యాయి. భూకంపం తీవ్రతకు నగరాలు శిథిలాల కుప్పలుగా మారాయి. ప్రజలు ఓ వైపు నిద్రలో ఉండగానే వేలాది భవనాలు నేలమట్టమయ్యాయి. లక్షలాది మంది నిరాశ్రయులుగా మిలిగారు. ఇండ్లను వదిలి టెంట్ల కింద, వాహనాల్లో తల దాచుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
మంటల్లో కాలిన హవాయి, మాయి
ఆగస్టు 8, 9 తేదీల్లో హవాయి, మాయి ద్వీపాల్లో చెలరేగిన కార్చిచ్చు పెను విషాదాన్ని మిగిల్చింది. పొడి వాతావరణానికి బలమైన గాలులు కూడా తోడవడంతో కార్చిచ్చు విధ్వంసం సృష్టించింది. అటవీ ప్రాంతం నుంచి పర్యాటక స్వర్గధామమైన దీవుల్లోని ఇండ్లు, భవనాలు, వాహనాలు మంటల్లో కాలి బూడిదయ్యాయి. రిసార్ట్ టౌన్గా పేరుగాంచిన లహియానాపై కార్చిచ్చు తీవ్ర ప్రభావం చూపింది. కొన్ని రోజుల పాటు కొనసాగిన ఈ కార్చిచ్చులో దాదాపు 100 మంది ప్రాణాలు కోల్పోయారు.
అంతర్యుద్ధంతో సూడాన్ రక్తసిక్తం
అధికారంపై పట్టు కోసం సూడానీస్ ఆర్మ్డ్ ఫోర్సెస్(ఎస్ఏఎఫ్), పారామిటలరీ రాపిడ్ సపోర్టు ఫోర్సెస్(ఆర్ఎస్ఎఫ్) మధ్య ఏప్రిల్ 15న ప్రారంభమైన పోరుతో సూడాన్ రక్తసిక్తంగా మారింది. దీర్ఘకాలంగా పాలిస్తున్న ఒమర్ అల్ బషీర్ ప్రభుత్వాన్ని 2019లో కలిసి కూలదోసిన ఎస్ఏఎఫ్, ఆర్ఎస్ఎఫ్.. దేశ భవిష్యత్తు విషయంలో మాత్రం భిన్నమైన దృష్టి కలిగివున్నాయి. హింసాకాండలో 9 వేల మంది మరణించారు.
విషాద కథగా మిలిగిన ‘టైటాన్’
2023లో టైటాన్ మినీ జలాంతర్గామి కథ విషాదంగా మిగిలింది. అట్లాంటిక్ సముద్రంలో 12 వేల అడుగుల లోతులో ఉన్న టైటానిక్ నౌక శకలాలను చూసేందుకు వెళ్లిన టైటాన్ సంబంధాలు జూన్ 18న తెగిపోయాయి. టైటాన్ జలాంతర్గామి సముద్ర గర్భంలో నీటి ఒత్తిడికి పేలిపోయినట్టు నాలుగు రోజుల తర్వాత యూఎస్ కోస్ట్గార్డు ప్రకటించింది. ఇందులో వెళ్లిన ఓషన్గేట్ వ్యవస్థాపకుడు స్టాక్టన్ రష్ సహా ఐదుగురి మరణించారు.
ఇమ్రాన్ జైలుకు.. నవాజ్ పాకిస్థాన్కు..
2023లో పాకిస్థాన్లో కీలక రాజకీయ పరిణామాలు చోటుచేసుకొన్నాయి. గత ఏడాది అవిశ్వాస తీర్మానంలో ప్రధానమంత్రి పదవి కోల్పోయిన ఇమ్రాన్ఖాన్.. ఈ ఏడాది తోషాఖానా అవినీతి కేసులో జైలుకు వెళ్లారు. ఇదే సమయంలో మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ నాలుగేండ్ల తర్వాత దేశంలో అడుగుపెట్టారు. గత నాలుగేండ్లుగా లండన్లో తలదాచుకొన్న నవాజ్.. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో పోటీచేసేందుకు సిద్ధమవుతున్నారు.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం
సైనిక చర్య పేరుతో ఉక్రెయిన్పై రష్యా ప్రారంభించిన యుద్ధం ఈ ఏడాది కూడా కొనసాగింది. ఉక్రెయిన్లో ఇప్పటికీ అస్థిర పరిస్థితులు నెలకొన్నాయి. జూన్లో తూర్పు భూభాగాన్ని తిరిగి అధీనంలోకి తెచ్చుకొన్నట్టు ఉక్రెయిన్ పేర్కొన్నది. ప్రస్తుతం డాన్బాస్ రీజియన్ కేంద్రంగా పోరు నడుస్తున్నది. రష్యా దాడుల్లో దాదాపు 10 వేల మంది ఉక్రెయిన్ పౌరులు మరణించినట్టు అంచనా. రెండు దేశాలకు చెందిన 5 లక్షల మంది వరకు సైనికులు కూడా ప్రాణాలు కోల్పోయినట్టు నివేదికలు చెబుతున్నాయి. శాంతి చర్చలు ఆగిపోవడంతో.. ఈ యుద్ధానికి ఎప్పుడు తెరపడుతుందనే దానిపై స్పష్టత లేదు.
భారత్-కెనడా మధ్య ఉద్రిక్తతలు
ఖలిస్థానీ అంశం 2023లో భారత్, కెనడా మధ్య చిచ్చు పెట్టింది. ఖలిస్థానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య విషయంపై రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు నెలకొన్నాయి. నిజ్జర్ హత్యలో భారత్ ప్రమేయం ఉన్నదని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో సంచలన ఆరోపణలు చేశారు. అయితే ట్రూడో ఆరోపణలను భారత ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. ఆధారాలు ఉండే చూపాలని స్పష్టం చేసింది. దీంతో భారత్, కెనడా మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి.
జనాభాలో చైనాను దాటేశాం..
జనాభాలో భారత్ 2023లో చైనాను దాటేసింది. ఐరాస నివేదిక ప్రకారం 142.86 కోట్ల మంది జనాభాతో ప్రపంచంలోనే మొదటి స్థానంలో నిలిచింది. 142.57 కోట్ల జనాభాతో చైనా రెండో స్థానానికి దిగింది. భారత్ మొత్తం జనాభాలో 68 శాతం మంది 15-64 ఏండ్ల మధ్య ఉన్నవారేనని నివేదిక వెల్లడించింది.