రాంచీ, జూలై 20: బీజేపీ పాలిత హర్యానాలో మైనింగ్ మాఫియా రెచ్చిపోయి డీఎస్పీ ర్యాంకు పోలీస్ అధికారిపైకి ట్రక్కు ఎక్కించి హత్యచేసిన ఘటన మరువక ముందే జార్ఖండ్లో ఇదే తరహా సంఘటన జరిగింది. ఓ మహిళా సబ్ఇన్స్పెక్టర్పైకి దుండగులు వాహనాన్ని ఎక్కించి హత్య చేశారు. తనిఖీలు చేస్తూ దుండగుల వాహనాన్ని ఆపినందుకు ఆమెపైకి ఆ వ్యాన్ ఎక్కించారు. రాంచీ సీనియర్ ఎస్పీ కౌషల్ కిశోర్ తెలిపిన వివరాల ప్రకారం.. తుపుడానా ఔట్పోస్టు ప్రాంతంలో ఎస్సై సంధ్య తోప్నో తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా ఓ వాహనం వస్తున్నదని ఆమె ఆపారు. దీంతో దుండగులు వ్యాన్తో ఆమెను ఢీకొట్టారు. ఆమెకు గాయాలవ్వడంతో వెంటనే దగ్గర్లోని దవాఖానకు తీసుకెళ్లగా అప్పటికే ఆమె చనిపోయినట్టు డాక్టర్లు చెప్పారు. వాహనాన్ని స్వాధీనం చేసుకుని, డ్రైవర్తో పాటు మరో వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.
గుజరాత్లో కానిస్టేబుల్..
బీజేపీ పాలిత రాష్ట్రం గుజరాత్లో తనిఖీ విధుల్లో ఉన్న ఓ పోలీస్ కానిస్టేబుల్పైకి ట్రక్కు ఎక్కించడంతో అక్కడికక్కడే మరణించాడు. కరణ్సింగ్ రాజ్ (40) బోర్సాద్ టౌన్లో తనిఖీలు చేస్తుండగా, ఓ ట్రక్కు ఆపకుండా వెళ్లింది. కానిస్టేబుల్తో పాటు మరో జవాను బైక్పై ఆ ట్రక్కును వెంబడించి ఆపారు. అయితే ఓ చోట ఆపినట్టే ఆపి బైక్పై నుంచి ట్రక్కును డ్రైవర్ పోనిచ్చాడు. దీంతో కానిస్టేబుల్ తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే దవాఖానకు తీసుకెళ్లగా చికిత్స పొందుతూ మరణించారు. ట్రక్కును నిందితుడు అక్కడే వదిలిపారిపోయాడు.