న్యూఢిల్లీ, మే 1: పుట్టక ముందే కుమారుడిని వదిలిపెట్టి వెళ్లిపోయిన తండ్రి పేరును పాస్పోర్టులో చేర్చాల్సిన అవసరం లేదని ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పింది. పాస్పోర్ట్ మాన్యువల్ 2020 దీనికి సంబంధించిన పలు పరిస్థితులు, షరతులను స్పష్టంగా పేర్కొన్నందున మైనర్ బాలుడి పాస్పోర్టులో అతడి తండ్రి పేరు ఉండాల్సిన అవసరం లేదంటూ జస్టిస్ ప్రతిభా ఎం సింగ్ సోమవారం తీర్పు చెప్పారు.
తాను ఒంటరి తల్లి అయినందున తన కుమారుడి పాస్పోర్టు నుంచి తండ్రి పేరును తొలగించాలని ఒక మహిళ ఢిల్లీ హైకోర్టును అభ్యర్థించారు. తన కుమారుడు పుట్టక ముందే అతడి తండ్రి తన నుంచి విడాకులు తీసుకున్నాడని, అతని పేరును పాస్పోర్టులో తొలగించాలని కోరారు.