చెన్నై : బోన్ క్యాన్సర్తో బాధపడుతున్న ఓ 14 ఏండ్ల అబ్బాయికి ఓవర్ డోస్లో ఇంజక్షన్లు ఇచ్చి చంపేశారు. ఈ దారుణ ఘటన తమిళనాడులోని సేలం జిల్లాలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళ్తే.. పెరియాసామి అనే వ్యక్తికి వన్నతమిజాన్(14) అనే కుమారుడు ఉన్నాడు. గత ఏడాది కాలం నుంచి వన్నతమిజాన్ బోన్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు. కుమారుడి బాధను చూడలేక తండ్రి తల్లడిల్లిపోయాడు. ఆ నొప్పిని భరించలేక కుమారుడు అరుస్తుంటే తండ్రి ఆవేదన చెందేవాడు. దీంతో తన బిడ్డ పడుతున్న బాధను చూసి తట్టుకోలేక పెరియాసామి.. ల్యాబ్ టెక్నిషీయన్ వెంకటేశన్ సంప్రదించాడు. నొప్పిని నివారించేలా ఏదైనా మెడిసిన్ ఇవ్వాలని కోరాడు.
దీంతో పెరియాసామి, వెంకటేశన్ కలిసి మెడికల్ ప్రొఫెషనల్ ప్రభు అనే వ్యక్తిని కలిశారు. ఆ తర్వాత ప్రభు.. పెరియాసామి ఇంటికెళ్లి వన్నతమిజాన్కు ఓ ఇంజక్షన్ ఇచ్చాడు. అనంతరం ఆ అబ్బాయి మరణించాడు. మూడు ఔషధాలు కలిపి ఇవ్వడంతో అది ఓవర్ డోస్ అయి వన్నతమిజాన్ చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. తండ్రి పెరియాసామి, ల్యాబ్ టెక్నిషీయన్ వెంకటేశన్, మెడికల్ ప్రొఫెషనల్ ప్రభును పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.