శ్రీనగర్, ఫిబ్రవరి 15: కాంగ్రెస్ నేతృత్వంలో ఏర్పాటైన ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’కి వరుస ఎదురుదెబ్బలు తగులుతున్నాయి. కూటమితో సంబంధం లేకుండా ఎన్నికల్లో పోటీ చేస్తామని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా తాజాగా ప్రకటించారు. గురువారం శ్రీనగర్లో మీడియాతో మాట్లాడుతూ, రానున్న ఎన్నికల్లో జమ్ముకశ్మీర్లో నేషనల్ కాన్ఫరెన్స్ ఒంటరిగా పోటీ చేస్తుందని ప్రకటించారు. ఏ పార్టీతో పొత్తు ఉండదని స్పష్టం చేశారు.
సొంతబలంపైనే ఎన్నికలకు వెళ్తామని తెలిపారు. కూటమితో కలవకుండా, ఒంటరిగా ఎన్నికల్లో పోటీ చేయడానికి గల కారణాల్ని ఆయన వెల్లడించలేదు. అయితే వచ్చే ఎన్నికల్లో ఇండియా కూటమితోనే కొనసాగుతామని ఫరూక్ అబ్దుల్లా కుమారుడు, మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా స్పష్టంచేయడం గమనార్హం. వచ్చే లోక్సభ ఎన్నికల్లో జమ్ము కశ్మీర్లోని మొత్తం ఆరు సీట్లలో మూడింటిలో పోటీచేసేందుకు కాంగ్రెస్తో చర్చలు జరుగుతున్నాయని ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా, ఫరూక్ అబ్దుల్లాకు ఇటీవల ఈడీ నుంచి సమన్లు అందాయి. జమ్ముకశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ ఆర్థిక లావాదేవీల్లో అక్రమాలు జరిగాయని ఈడీ ఆరోపిస్తున్నది.