న్యూఢిల్లీ: కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం ప్రారంభించి రెండేండ్లు పూర్తవుతున్న నేపథ్యంలో శనివారం దేశవ్యాప్తంగా అన్నదాతలు రాజ్భవన్లకు మార్చ్ చేపట్టనున్నారు. చట్టాల రద్దు సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను ఇంకా నెరవేర్చకపోవడాన్ని నిరసిస్తూ ఈ మార్చ్ నిర్వహిస్తున్నారు. పంటలకు కనీస మద్దతు ధర కల్పించడంపై చర్చలు జరిపి, చట్టం తెస్తామని కేంద్రం చెప్పినా ఇంతవరకూ ముందడుగు పడలేదని రైతు నేతలు ఆరోపిస్తున్నారు.
‘మా డిమాండ్లు నెరవేరుస్తామని కేంద్రం రాతపూర్వక హామీ ఇచ్చింది. అయినా ఇంతవరకూ వాటిని నెరవేర్చలేదు. దేశ రైతులకు బీజేపీ సర్కారు నమ్మకద్రోహం చేసింది. వారు కార్పొరేట్లను కాపాడుతున్నారు. మా డిమాండ్లు నెరవేర్చే ఉద్దేశం కేంద్రానికి లేదని తేలిపోయింది’ అని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం)నేత హన్నన్ మొల్లా మండిపడ్డారు. తదుపరి కార్యాచరణను నిర్ణయించేందుకు ఎస్కేఎం వచ్చే నెల 8న ఢిల్లీలో సమావేశం కానున్నది. ‘రైతుల గోడు కేంద్రం పట్టించుకోవడం లేదు. మేం మరో ఉద్యమం ప్రారంభించాం. దేశవ్యాప్తంగా అన్నదాతలు ర్యాలీలు నిర్వహించనున్నారు. రాజ్భవన్కు చేరుకొని గవర్నర్కు మెమొరాండం అందజేస్తారు’ అని మొల్లా తెలిపారు. ఎంఎస్పీపై చట్టం తేవాలని, రైతులపై పెట్టిన కేసులను ఉపసంహరించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.