మీరట్, జూన్ 26: బోరుబావుల మోటర్లకు మీటర్లు పెట్టడంపై యూపీ రైతులు రగిలిపోతున్నారు. కేంద్రం, రాష్ట్రంలోని బీజేపీ ప్రభుత్వాల వైఖరికి నిరసనగా భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) ఆధ్వర్యంలో పశ్చిమ యూపీలోని 14 జిల్లాలకు విద్యుత్తు సరఫరా చేసే మీరట్లోని పశ్చిమాంచల్ విద్యుత్తు నిగమ్ లిమిటెడ్(పీవీవీఎన్ఎల్) ప్రధాన కార్యాలయం ముందు రైతులు నిర్వహించతలపెట్టిన మహాపంచాయత్ (ధర్నా) సోమవారం జరుగనున్నది.
వందలాది మంది రైతులు ధర్నాకు హాజరవుతారని రైతు నేతలు తెలిపారు. బోరుబావులకు మీటర్లు పెట్టి వేలల్లో బిల్లుల మోత మోగిస్తుండటంపై రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధిక బిల్లులతో విసిగిపోయిన పశ్చిమ యూపీలోని పలు గ్రామాలకు చెందిన వందలాది మంది అన్నదాతలు ఇప్పటికే విద్యుత్తు మీటర్లను ఊడబీకారు.