Farmers Protest | రైతు సంఘాల నేతలతో చండీగఢ్లో కేంద్రమంత్రులు జరిపిన చర్చలు అసంపూర్తిగా ముగిశాయి. ఇప్పటి వరకు మూడు దఫాలుగా చర్చలు జరిపినా.. సమస్యకు పరిష్కారం దొరకలేదు. సమావేశంలో హర్యానా ప్రభుత్వం, పోలీసుల చర్యలపై రైతు సంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్లారు. ఆ తర్వాత ఎంఎస్పీకి చట్టపరంగా హామీ, ఇతర డిమాండ్లపై చర్చించారు. అలాగే, లఖింపూర్ ఖేరి ఘటనతో సహా ఇతర డిమాండ్లపై రైతు నేతలతో ఏకీభవించినట్లు సమాచారం. భేటీలో ఎంఎస్పీ చట్టబద్ధమైన హామీ అమలులో తలెత్తే సమస్యలపై కేంద్రమంత్రులు రైతు సంఘాలకు వివరించారు. అయితే, ఇందులో వెనక్కి తగ్గేది లేదని రైతుసంఘాల నేతలు భీష్మించారు. డిమాండ్లపై మరోసారి ఆదివారం సాయంత్రం 6 గంటలకు చర్చలు జరుగనున్నాయి. సమావేశం అనంతరం కేంద్రమంత్రి అర్జున్ ముండా మాట్లాడుతూ రైతుసంఘాలు, ప్రభుత్వం మధ్య చర్చలు సానుకూలంగా జరిగాయన్నారు. రైతు సంఘాలు లేవనెత్తిన సమస్యలపై దృష్టి సారించి, పలు నిర్ణయాలు తీసుకున్నామన్నారు.
మరోసారి ఆదివారం సమావేశమై శాంతియుత పరిష్కారం కనుగొంటామన్నారు. అనంతరం పంజాబ్ సీఎం భగవంత్ మాన్ మాట్లాడుతూ రైతుసంఘాలు, కేంద్ర ప్రభుత్వం మధ్య సుదీర్ఘ చర్చ జరిగిందన్నారు. ప్రతి అంశంపై కూలంకషంగా చర్చించారన్నారు. అనేక అంశాలపై ఏకాభిప్రాయం కుదిరింది. కానీ, పంజాబ్ ప్రజల శాంతిభద్రతలు, సమస్యలు ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. సరిహద్దు ప్రాంతాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు హర్యానా ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు. సరిహద్దు ప్రాంతాల్లో ఇంటర్నెట్ను నిలిపివేయడంతో విద్యార్థులు ఇబ్బందులుపడుతున్నారన్నారు. నిరసన శాంతియుతంగా కొనసాగుతుందని రైతు నాయకుడు జగ్జీత్ సింగ్ దల్లెవాల్ తెలిపారు. తాము ఇంకేమీ చేయమన్నారు. ఢిల్లీ వైపు వెళ్లాలని, సమావేశాలు కొనసాగించడం ఒకేసారి చేయలేమన్నారు. ప్రభుత్వం సమావేశం ఏర్పాటు చేసిందని.. అప్పటి వరకు వేచి చూస్తామన్నారు. ఆదివారం సానుకూల ఫలితం రాకుంటే నిరసన కొనసాగిస్తామన్నారు. అదే సమయంలో తమపై హింసాత్మక చర్యలు తీసుకున్నా.. వెనక్కి తగ్గమని పలువురు రైతు సంఘాల నేతలు పేర్కొన్నారు. బలప్రయోగం సరికాదని నేతలు.. తాము భారతీయులమేనని.. పాకిస్థాన్ వాళ్లం కాదంటూ విమర్శిస్తున్నారు.