Farmers Protest | రైతులు మరోసారి ఆందోళనబాట పట్టనున్నారు. ఈ నెల 6 నుంచి ఉద్యమాన్ని ఉధృతం చేయనున్నారు. పంజాబ్, హర్యానా మినహా దేశంలోని వివిధ రాష్ట్రాల రైతులు ఢిల్లీకి పాదయాత్ర నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని రైతు సంఘాల నేతలు ప్రకటించారు. పంజాబ్ భటిండా జిల్లాలో యువ రైతు శుభకరణ్ సింగ్ భోగ్ సమాగం ఆదివారం జరిగింది. ఈ కార్యక్రమంలో రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నేతలు కీలక ప్రకటన చేశారు. 6న పలు రాష్ట్రాలకు చెందిన రైతులు ఢిల్లీకి పాదయాత్ర నిర్వహిస్తారని వెల్లడించారు. అలాగే, 10న దేశవ్యాప్తంగా నాలుగు గంటల పాటు రైల్రోకో నిర్వహించనున్నట్లు తెలిపారు.
14న ఢిల్లీలోని రాంలీలా మైదాన్లో కిసాన్ మహాపంచాయత్ జరుగుతుందని ప్రకటించారు. రైతు నేత జగ్జీత్ సింగ్ దల్వాల్ మాట్లాడుతూ ఢిల్లీకి వెళ్లే ఆలోచన గతంలోనే నిర్ణయించినట్లుగా ఉందన్న ఆయన.. ఢిల్లీ ప్రణాళికను వాయిదా వేయలదేన్నారు. తాము అలా చేయమన్నారు. ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు కొన్ని వ్యూహాలను ఖరారు చేశామన్నారు. అయితే, మార్చి 6న దేశవ్యాప్తంగా రైతులు రైలు, బస్సులు, కాలినడకన శాంతియుతంగా ఢిల్లీకి వెళ్లాలనే వ్యూహాన్ని రైతు సంఘాల నేతలు ఖరారు చేశారు. అయితే, ప్రభుత్వం అనుమతి ఇస్తుందా? లేదా? మళ్లీ రైతు సంఘాలను చర్చలకు పిలుస్తుందా? చూడాల్సి ఉంది.
ఈ నెల 10న మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు దేశవ్యాప్తంగా రైలురోకో నిర్వహించాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. ఇదిలా ఉండగా.. ఈ నెల 21న ఖనౌరీ సరిహద్దుల్లో పోలీసులు-రైతు సంఘాల మధ్య ఘర్షణ జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో రైతు శుభకరణ్ తూటా గాయాలతో ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనపై పోలీసులు పటాన్లో గుర్తు తెలియని వ్యక్తులపై జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. మృతుడి కుటుంబానికి రూ.కోటి ఆర్థిక సహాయంతో పాటు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చింది. శుభకరన్ మృతి అంశాన్ని పంజాబ్ అసెంబ్లీలో విపక్షాలు లేవనెత్తాయి. అయితే, రైతు సంఘాలు పంటలకు కనీస మద్దతు ధర, రైతులకు పింఛన్లు తదితర డిమాండ్లు చేస్తూ ఆందోళన నిర్వహించిన విషయం తెలిసిందే. ప్రభుత్వం పలుసార్లు రైతుసంఘాలతో చర్చలు జరిపినా విఫలమయ్యాయి.