హర్యానాలోని పలు హైవేలను రైతులు బ్లాక్ చేశారు. కర్నాల్ జిల్లాలో రైతులపై పోలీసుల లాఠీ చార్జ్కు నిరసనగా.. రాష్ట్రంలోని రైతులంతా ఏకమై.. హైవేలను బ్లాక్ చేశారు. రోడ్ల మీద నిరసన తెలుపుతున్నారు.
దీంతో కురుక్షేత్ర, ఢిల్లీ – అమృత్సర్ హైవేల మీద ట్రాఫిక్ జామ్ అయింది. అంబాలా రూట్లో ఉన్న శంభు టోల్ ప్లాజా వద్ద కూడా భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. రోడ్ల మీద మంచాలు వేసుకొని కూర్చొని.. వందలు, వేల సంఖ్యలో రైతులు ఈ నిరసనలో పాల్గొన్నారు. కార్లు, బస్సులు, ట్రక్కుల్లో వేలాదిగా తరలివచ్చిన రైతులు నిరసన కార్యక్రమంలో పాల్గొంటున్నారు.
కర్నాల్లో పర్యటిస్తున్న హర్యానా బీజేపీ చీఫ్ ఓపీ ధన్కర్ కాన్వాయ్ని రైతులు అడ్డుకునే ప్రయత్నం చేయగా.. రైతులను చెదరగొట్టేందుకు పోలీసులు రైతులపై లాఠీచార్జ్ చేశారు. హర్యానా బీజేపీ చీఫ్ పానిపట్ నుంచి కర్నాల్కు రైతులను కలిసేందుకే వెళ్తున్నారని.. కానీ.. ఆయన కాన్వాయ్ బస్తారా టోల్ ప్లాజా దాటగానే.. రైతులు మూకుమ్మడిగా ఆయన కాన్వాయ్పై దాడి చేశారని పోలీసులు చెబుతున్నారు.
నూతన వ్యవసాయ చట్టాలపై వ్యతిరేకంగా పోరాడుతున్న సంయుక్త్ కిసాన్ మోర్చా.. రైతులపై పోలీసులు చేసిన లాఠీచార్జ్కు నిరసనగా హర్యానా వ్యాప్తంగా ఈరోజు హైవేలు బ్లాక్ చేసి నిరసనలు తెలపాలని నిర్ణయించింది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా రైతులు ముందుకు వచ్చి.. ఈనిరసనలో పాల్గొంటున్నారు.