Farmers Movement | రైతు సంఘాల కవాతు నేపథ్యంలో హర్యానా పోలీసులు అభేద్యమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. పంజాబ్ సరిహద్దుల్లో మూడంచెల పోలీసు భద్రతా ఏర్పాటు చేశారు. మొదట బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF), ఆ తర్వాత ఆర్ఏఎఫ్, మూడో అంచెలో పోలీసులు హర్యానా సాయుధ పోలీసుల బలగాలను మోహరించారు. పంజాబ్తో సరిహద్దును మూసివేయడమే కాకుండా లింక్రోడ్లోనూ పోలీసు సిబ్బందిని తరలించారు. ఈ నెల 13న తనిఖీల అనంతరమే వాహనాలను హర్యానాలోకి అనుమతించనున్నారు.
రాష్ట్రంలో శాంతిభద్రతల పరిరక్షణ కోసం 15 జిల్లాల్లో 144 సెక్షన్ విధించారు. ట్రాక్టర్ల ర్యాలీని నిషేధించారు. ఇంటెలిజెన్స్ విభాగం ఎప్పటికప్పుడు సమాచారాన్ని సేకరిస్తూ హర్యానా సీఎంవోకు పంపుతున్నది. మానిటరింగ్ సెల్ సోషల్ మీడియా తప్పుడు సమాచార వ్యాప్తిపై నిఘా పెట్టింది. సోషల్ మీడియాలో పుకార్లు వ్యాప్తి చేసేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
వెరిఫికేషన్ లేకుండా సోషల్ మీడియాలో ఎలాంటి కంటెంట్, వీడియో షేర్ చేయొద్దని సూచించారు. గత నిరసన కారణంగా భారీగా ఆర్థిక నష్టాన్ని చవిచూసినందున నిరసన ఆపేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని పారిశ్రామిక సంస్థలు అధికారులకు విజ్ఞప్తి చేశాయి. రాష్ట్రంలోని వివిధ రైతు సంఘాలు కూడా నిరసనలో పాల్గొనబోమని పోలీసు అధికారులకు హామీ ఇచ్చాయని ప్రభుత్వ ప్రతినిధి తెలిపారు.
ట్రాక్టర్ ట్రాలీలు పొలాల్లో పరుగెత్తేందుకే తప్ప ఎలాంటి ప్రదర్శన కోసం కాదన్నారు. పంజాబ్ వెళ్లే ప్రయాణికులు తప్పనిసరిగా ట్రాఫిక్ అడ్వైజరీని పాటించాలని డీజీపీ శత్రుజీత్ కపూర్ సూచించారు. ఏదైనా అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112 నంబర్లో సంప్రదించాలని సూచించారు. ఎవరైనా చట్టాన్ని అతిక్రమించడానికి ప్రయత్నిస్తే వారిపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. పంజాబ్ సరిహద్దుల్లో పారామిలటరీ బలగాలతో పాటు హర్యానా పోలీసు సిబ్బందిని మోహరించినట్లు డీజీపీ పేర్కొన్నారు.