ఛత్రపతి శంభాజీనగర్, మే 26 : ఉల్లి ధరలు ఘోరంగా పడిపోవడం పట్ల బీజేపీ పాలిత మహారాష్ట్రలో రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆరుగాలం పండించిన పంటకు క్వింటాల్కు కేవలం 100 నుంచి 125 రూపాయల ధర పలకడంతో రైతులు సోమవారం సాయంత్రం గంగాపూర్ అగ్రికల్చరల్ ప్రొడ్యూస్ మార్కెట్ కమిటీ (ఏపీఎంసీ) బయట గంగాపూర్-నాసిక్ రోడ్పై తాము తెచ్చిన ఉల్లిగడ్డలను పారబోసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. దీంతో ఆ రోడ్డుపై సుమారు గంట సేపటి వరకు ట్రాఫిక్ నిలిచిపోయింది. ఏపీఎంపీ అధికారులు, ఇతరులు ఘటనా స్థలికి చేరుకుని రైతులను శాంతింప చేశారు.
వాహెగాన్, రంజన్గావ్తో పాటు పరిసర ప్రాంతాల్లోని రైతులు మార్కెట్లో అమ్మేందుకు ఉల్లిగడ్డలను తీసుకువచ్చారు. అయితే కిలోకు రూపాయి నుంచి రూపాయిన్నర ధర మాత్రమే పలకడంతో వారు తీవ్ర ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉల్లిని పండించడానికి అయిన ఖర్చు కాదు కదా, కనీసం రవాణా చార్జి కూడా రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల వాతావరణంలో సంభవించిన మార్పులను వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుని ధరలను ఘోరంగా తగ్గించారని రైతులు ఆరోపించారు. ఈ ధరకు వాళ్లకు అమ్మడం కంటే రోడ్డుపై పారేయడమే ఉత్తమమని పలువురు రైతులు కన్నీటి పర్యంతమయ్యారు. కాగా, ఈ ఏడాది అధిక మొత్తంలో పంట దిగుబడి రావడంతో ఉల్లి రైతులు కనీస గిట్టుబాటు ధర లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.