చండీగఢ్/లఖింపూర్ ఖేరీ, అక్టోబర్ 3: ఉత్తరప్రదేశ్లోని లఖింపూర్లో శాంతియుతంగా నిరసన తెలుపుతున్న రైతులను కేంద్ర మంత్రి అజయ్మిశ్రా కుమారుడు ఆశిష్మిశ్రా కారుతో తొక్కించి చంపిన ఘటనకు సోమవారంతో ఏడాది పూర్తయింది. ఈ ఘటనను నిరసిస్తూ, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ పంజాబ్తో పాటు పలు ప్రాంతాల్లో రైతులు సోమవారం ఆందోళనలు చేపట్టారు. కిసాన్ మజ్దూర్ సంఘర్ష్ కమిటీ(కేఎంఎస్సీ) ఆధ్వర్యంలో వందలాది మంది రైతులు పంజాబ్లోని దాదాపు 20 ప్రాంతాల్లో 3 గంటల పాటు రైలురోకో నిర్వహించారు. పగ్వారాలో బీకేయూ(దోబా) నేతలు ఆందోళన చేపట్టారు. యూపీలోని లఖింపూర్ జిల్లా కౌడియాలా ఘాట్లోని గురుద్వారాలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రైతు అమరవీరులకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీకేయూ నేత రాకేశ్ టికాయిత్ మాట్లాడుతూ లఖింపూర్ హింసాకాండను ప్రభుత్వం మర్చిపోయినప్పటికీ, తాము మర్చిపోబోమని అన్నారు. కేంద్ర మంత్రి అజయ్మిశ్రాను పదవి నుంచి తప్పించడం కంటే తమకు మరేదీ ఆమోదనీయం కాదని పేర్కొన్నారు.
నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలి
పంజాబ్లోని అమృత్సర్ జిల్లాలో వల్లా వద్ద రైతులు అమృత్సర్-ఢిల్లీ రైలు ట్రాకును దిగ్బంధించారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు కేంద్ర మంత్రి అజయ్మిశ్రాను పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కేఎంఎస్సీ నేత సర్వాన్ సింగ్ మాట్లాడుతూ లఖింపూర్ హింసాకాండ సూత్రదారుడు ఇంకా ప్రధానమైన పదవిని అనుభవిస్తున్నారని అజయ్మిశ్రాను ఉద్దేశించి అన్నారు. అరెస్టు చేసిన రైతులను విడుదల చేయాలని, రైతు హంతకులను ఉరి తీయాలని మరో రైతు నేత గుర్బచన్ సింగ్ డిమాండ్ చేశారు. రైతు అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వాలని బీకేయూ(దోబా) నేతలు డిమాండ్ చేశారు.
న్యాయం కోసం ఎదురుచూపులు..
లఖింపూర్ హింసాకాండలో మరణించిన రైతు కుటుంబాలు న్యాయం కోసం ఇంకా ఎదురుచూస్తున్నారని బీకేయూ నేత రాకేశ్ టికాయిత్ అన్నారు. ఆదివారం సాయంత్రం ఆయన మీడియాతో మాట్లాడుతూ గత ఏడాది అక్టోబర్ 3న జరిగిన ఈ దారుణ ఘటనను ఈ దేశం ఎప్పటికీ మర్చిపోదని పేర్కొన్నారు. మరోవైపు ప్రధాని మోదీ తీరుపై కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. లఖింపూర్లో రైతులను అశిష్ మిశ్రా కారుతో తొక్కించి చంపిన తర్వాత కూడా ఆయన తండ్రి అజయ్మిశ్రాను కేంద్ర మంత్రి పదవిలో కొనసాగించడం అంటే.. రైతులను అంతకంటే అవమానించడం మరొకటి ఉండదని ఆ పార్టీ నేత జైరాం రమేశ్ అన్నారు.
పీలో అక్కాచెల్లెళ్ల అదృశ్యం
లక్నో: ఉత్తరప్రదేశ్లోని బారాబంకీ జిల్లాలో ఇద్దరు అక్కాచెల్లెళ్లు అదృశ్యమయ్యారు. కోలా గహబడికి చెందిన వీరు జైద్పూర్లోని పాఠశాలలో చదువుతున్నారు. సోమవారం ఉదయం ఇంటి నుంచి స్కూల్కు బయలుదేరి కనిపించకుండా పోయారు. ఒకరు 8వ తరగతి, మరొకరు 9వ తరగతి చదువుతున్నారు. విద్యార్థినుల యూనిఫాం, సైకిళ్లు జైద్పూర్లోని రోడ్డుపక్కన కనిపించడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. బాలికలను కనిపెట్టేందుకు పోలీసులు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు.