న్యూఢిల్లీ, జూలై 12: కేంద్రంలోని మోదీ సర్కార్పై దేశ రైతాంగం రగులుతున్నది. వివాదాస్పద సాగు చట్టాలకు వ్యతిరేకంగా దాదాపు ఏడాదిన్నర పాటు సాగిన మహోత్తర ఉద్యమ విరమణ సమయంలో ఇచ్చిన ఎంఎస్పీకి చట్టబద్ధత, రైతుల కేసుల ఉపసంహరణ తదితర హామీలను అమలులో చేసిన ద్రోహంతో పాటు ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపై మండిపడుతున్నారు. రైతు సంక్షేమానికి కృషి చేయాల్సిన ప్రభుత్వం.. వారికి పలు విధాలుగా అండగా ఉండాల్సింది పోయి వ్యవసాయ మోటార్లకు మీటర్లు అంటూ చార్జీల రూపంలో రైతుల రక్తాన్ని పీల్చేందుకు ప్రయత్నాలు చేస్తున్న తీరును తీవ్రంగా నిరసిస్తున్నారు. మీటర్లను వ్యతిరేకంగా ఇటీవల యూపీలోని మీరట్లో భారీయెత్తున ఆందోళన చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో లఖింపూర్లో రైతుల ప్రాణాలు బలిగొన్న నిందితులపై అటు కేంద్రం, ఇటు ఢిల్లీలో ఉన్న బీజేపీ ప్రభుత్వాలు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడాన్ని ఆక్షేపిస్తున్నాయి. కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్పై కూడా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో దేశ రైతాంగం మరో దఫా ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా సంయుక్త కిసాన్ మోర్చా(ఎస్కేఎం) ఉద్యమ కార్యాచరణను ప్రకటించింది.
జంతర్మంతర్ వద్ద పంచాయత్
ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళనల విరమణ సమయంలో ఎంఎస్పీకి చట్టబద్ధత, రైతులపై కేసుల ఉపసంహరణ, అమరులైన రైతు కుటుంబాలకు పరిహారం తదితర అంశాలపై ఇచ్చిన హామీలను అమలు చేయడంలో మోదీ సర్కార్ వ్యవహరిస్తున్న అలసత్వ, నిర్లక్ష్య వైఖరిపై ఎస్కేఎం గత వారం ఉద్యమ కార్యచరణ ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఎంఎస్సీ అంశం, లఖింపూర్ నిందితులపై కేంద్రం, యూపీ సర్కార్ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో పాటు మోదీ సర్కారు కొత్తగా తీసుకొచ్చిన అగ్నిపథ్పై చర్చించేందుకు ఎస్కేఎం మంగళవారం ఢిల్లీలో సమావేశమైంది. దాదాపు 60కి పైగా రైతు సంఘాల నేతలు భేటీలో పాల్గొన్నారు. కేంద్రం తీరుకు నిరసనగా ఆగస్టు 22న ఢిల్లీలోని జంతర్మంతర్ వద్ద మహపంచాయత్ నిర్వహించాలని రైతు నేతలు నిర్ణయం తీసుకున్నారు. లఖింపూర్ ఘటనకు సంబంధించి కేంద్ర మంత్రి అజయ్మిశ్రాను తొలగించాలని డిమాండ్ చేస్తూ లఖింపూర్లో ఆగస్టు 18 నుంచి 20 వరకు 75 గంటల పాటు ధర్నా నిర్వహించనున్నట్టు తెలిపారు.
రాజకీయ పార్టీలకు దూరంగా..
రైతు సంఘాల ఐక్యవేదికను రాజకీయాలకు, పార్టీలకు దూరంగా ఉంచాలని తీర్మానించారు. కొంతమంది ఇతర ఎస్కేఎం సభ్యులను పరిగణనలోకి తీసుకోకుండా ఎంఎస్పీపై కేంద్రానికి లేఖ రాశారని పేర్కొన్నది. ఈ విషయం బయటకొచ్చిన తర్వాత.. వారితో సంబంధాలు కొనసాగించకూడదని నిర్ణయం తీసుకున్నామని ఎస్కేఎం నేత ఒకరు పేర్కొన్నారు.
31న రైలురోకో
ఎస్కేఎం దేశవ్యాప్త ఆందోళనల పిలుపులో భాగంగా జూలై 31న పంజాబ్లో రైలురోకో చేపట్టనున్నారు. ఈ మేరకు లూథియానాలోని భారతి కిసాన్ యూనియన్ కార్యాలయంలో సోమవారం జరిగిన ఎస్కేఎం నేతల సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఈనెల 18 నుంచి 31 జిల్లాస్థాయి సదస్సులు నిర్వహించనున్నట్టు బీకేయూ ప్రధాన కార్యదర్శి, ఎస్కేఎం సభ్యుడు హరీందర్ సింగ్ పేర్కొన్నారు. అగ్నిపథ్కు వ్యతిరేకంగా ఆగస్టు 7 నుంచి 14 వరకు జరిగే సదస్సుల్లో రైతులు పెద్దయెత్తున పాల్గొంటారని తెలిపారు.
పార్లమెంట్ సమావేశాల ప్రారంభం నుంచి..
హామీల అమలులో మోదీ సర్కార్ చేసిన మోసంపై పార్లమెంట్ వర్షాకాల సమాశాలు ప్రారంభయ్యే రోజు జూలై 18 నుంచి 31 వరకు ‘ద్రోహానికి వ్యతిరేకంగా పోరాటం’ పేరుతో దేశవ్యాప్తంగా జిల్లాస్థాయిల్లో సదస్సులు నిర్వహించాలని ఎస్కేఎం ఇప్పటికే నిర్ణయించింది. జూలై 31న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రధాన జాతీయ రహదారులపై చక్కాజామ్(రోడ్ల దిగ్బంధం) చేపడుతామని ప్రకటించింది. ఇదే సమయంలో అగ్నిపథ్ స్కీమ్పై రైతు సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి. ఈ కొత్త విధానం దేశ వ్యతిరేక, యువత వ్యతిరేక, రైతు వ్యతిరేకమైనదిగా అభివర్ణించాయి. దేశవ్యాప్తంగా ఆగస్టు 7 నుంచి 14 వరకు ‘జై జవాన్, జై కిసాన్’ పేరుతో సదస్సులు నిర్వహిస్తామని, వీటికి నిరుద్యోగ యువతతో పాటు మాజీ సైనికులను కూడా ఆహ్వానిస్తామని ఎస్కేఎం పేర్కొన్నది.