ముంబై: కొందరి కాళ్లు పగిలి రక్తాలు కారుతున్నాయి.. ఇంకొందరి కాళ్లు వాచిపోయాయి.. మరికొందరు నడవలేక కూలబడిపోయారు.. ఇవీ నాసిక్ నుంచి ముంబై వెళ్లే రహదారిపై కనిపిస్తున్న హృదయ విదారక దృశ్యాలు! కండ్ల ముందు కనిపిస్తున్న రైతుల అవస్థలు!! కాళ్లు పొక్కులతో కమిలిపోయినా ఓ ముసలవ్వ తన మార్చ్ను కొనసాగిస్తున్నే ఉన్నది. అవ్వా! నువ్వు విశ్రాంతి తీసుకో.. మేం మార్చ్ కొనసాగిస్తాం అని చెప్పినా.. ‘మన డిమాండ్ల కోసం ఎంతవరకైనా వెళ్తా బిడ్డా. కాళ్లు కమిలిపోవటం, పొక్కులు ఓ లెక్కా!’ అని చెప్పి ముందుకు సాగింది. వందల కిలోమీటర్లు నడిచి ఓ పెద్దాయన కాళ్ల మడిమలు పగిలి రక్తం కారుతున్నా, వస్ర్తాన్ని కట్టుకొని నడుస్తున్నాడు తప్ప, తన పోరాటాన్ని ఆపడం లేదు. ఉల్లి పంటకు ధర లేక కడుపు మండిన అన్నదాతలు మహారాష్ట్ర బీజేపీ ప్రభుత్వంపై కదం తొక్కుతూ వందలాదిగా రాజధానివైపు పాదయాత్ర చేపట్టారు.
ఐదు రోజుల క్రితం నాసిక్లో మొదలైన ఈ మార్చ్.. గురువారం నాటికి 200 కిలోమీటర్లు పూర్తి చేసుకొన్నది. ఉల్లికి మద్దతు ధర ఇవ్వాలని, ఇతర డిమాండ్లను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరుతూ రైతులు రాజధాని ముంబై వైపు వెళ్తున్నారు. మండుటెండను కూడా లెక్క చేయకుండా రైతులు తమ మార్చ్ను కొనసాగిస్తున్నారు. 60 ఏండ్ల దాటిన వృద్ధ రైతులు కూడా ఈ నిరసనలో పాల్గొంటున్నారు. ఎండల ధాటికి చాలా మంది రైతుల ఆరోగ్యం క్షీణించింది. 40 మంది రైతులు అనారోగ్యానికి గురయ్యారు. డీహైడ్రేషన్, తలనొప్పి, పొక్కులు తదితర సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. దీంతో ఒక అంబులెన్స్ వీరి వెంటే వస్తున్నదని రైతు నాయకులు తెలిపారు.
కనీస ధర కోసం రైతుల డిమాండ్
ఉల్లి ధరలు క్వింటాలుకు రూ.2కు పడిపోవడంతో వందల మంది రైతులు పంటను రోడ్లపై పారబోశారు. కొందరు రైతులు.. ఇదీ తమ దుస్థితి అని తెలిపేలా ప్రధాని మోదీకి ఉల్లిగడ్డలను పార్శిల్ చేశారు. ఇంకొందరు రైతులు పశువులకు దాణాగా వేశారు. పంట మొత్తాన్ని కాలబెట్టారు. క్వింటాలు ఉల్లికి రూ.600 ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అయినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల్లో కొంచెం కూడా చలనం లేకపోయింది. దీంతో ఆగ్రహించిన రైతన్నలు మార్చ్ చేపట్టారు.