Delhi Chalo | న్యూఢిల్లీ/చండీగఢ్, ఫిబ్రవరి 11: అన్నదాతలు మరోసారి పోరుబాట పట్టారు. కనీస మద్దతు ధరకు చట్టబద్ధత కల్పించడంతోపాటు తమ ఇతర డిమాండ్లు పరిష్కరించేలా కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు దాదాపు 200కు పైగా రైతు సంఘాలు ఈ నెల 13న(మంగళవారం) ‘ఢిల్లీ చలో’ మార్చ్ నిర్వహించతలపెట్టాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలోకి రైతులు ప్రవేశించకుండా అధికారులు సరిహద్దుల్లో అధిక బలగాలను మోహరించారు. సింఘూ, ఘాజీపూర్, టిక్రి సరిహద్దుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. రైతులతో కూడిన వాహనాలు ఢిల్లీలోకి ప్రవేశించకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.
రైతుల వాహనాలు పంక్చర్ అయ్యేలా పలు చోట్ల ఇనుప మేకులు కూడా ఏర్పాటు చేశారు. హర్యానా-ఢిల్లీ, యూపీ-ఢిల్లీ సరిహద్దుల్లో భద్రతా ఏర్పాట్లను ఢిల్లీ పోలీసు కమిషనర్ సంజయ్ అరోరా ఆదివారం పరిశీలించారు. రాజధానిలోకి ప్రవేశించే రోడ్లను బ్లాక్ చేసేందుకు పెద్ద కంటెయినర్లను తరలిస్తున్నారు. బస్సు, రైలు లేదా ఏ ఇతర మార్గంలోనూ రైతులు ఢిల్లీలోకి ప్రవేశించకుండా చూసేలా పలు బృందాలతో నిఘా పెట్టారు. ఈశాన్య డిల్లీలో 144 సెక్షన్ కూడా విధించి నిషేద్ఞాలు అమలు చేస్తున్నారు. ‘ఢిల్లీ చలో’ ఆందోళనకు పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్ నుంచి పెద్దయెత్తున రైతులు వచ్చే అవకాశం ఉన్నదని అధికారులు భావిస్తున్నారు.
మరోవైపు హర్యానాలోని ఖట్టర్ ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. రైతులను నిలువరించేందుకు పోలీసు, సీఆర్పీఎఫ్ బలగాలను మోహరించింది. పంజాబ్ నుంచి రాష్ట్రంలోకి రైతులు ప్రవేశించకుండా సరిహద్దుల్లో సిమెంట్ బారికేడ్లు, ఇనుప కంచెలను సిద్ధం చేసింది. కొన్ని చోట్ల రోడ్లపై కొంత మంది ఇనుప మేకులను డ్రిల్లింగ్ చేస్తుండటం కనిపించిందని మీడియా నివేదికలు పేర్కొన్నాయి. వాహనాలను అంబాలా నుంచి ఢిల్లీ వైపు వెళ్లనీయకుండా శంభు వద్ద హర్యానా-పంజాబ్ సరిహద్దును మూసివేశారు. ఆదివారం నుంచి మంగళవారం రాత్రి వరకు అంబాలా, కురుక్షేత్ర సహా ఏడు జిల్లాల్లో మొబైల్ ఇంటర్నెట్, బల్క్ ఎస్ఎంఎస్ సేవలపై ఆంక్షలు విధించారు. చాలా జిల్లాల్లో 144 సెక్షన్ విధించింది. ఢిల్లీకి సమీపంగా ఉండే సరిహద్దు సోనిపట్లో సీసాలు, ఇతర డబ్బాల్లో ఇంధనం నింపవద్దని ఆయిల్ బంకుల యాజమానులకు జిల్లా యంత్రాంగం సూచించింది. ట్రాకర్లకు ఇంధన ఫిల్లింగ్ను 10 లీటర్ల వరకే పరిమితం చేసింది.
రైతు సంఘాల చలో ఢిల్లీ మార్చ్ నేపథ్యంలో కేంద్రం రైతు నేతలను చర్చలకు ఆహ్వానించింది. సంయుక్త కిసాన్ మోర్చా(నాన్ పొలిటికల్), కిసాన్ మజ్దూర్ మోర్చా సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపించేందుకు కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అర్జున్ ముండా, నిత్యానంద్ రాయ్ సోమవారం చండీగఢ్ రానున్నారని రైతుల నేత శర్వాన్ సింగ్ పంధేర్ పేర్కొన్నారు. మరోవైపు రైతులతో చర్చించాలని పంజాబ్ సీఎం మాన్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. పంజాబ్, ఇండియా మధ్య సరిహద్దు నిర్మించొద్దని కేంద్రాన్ని కోరారు.