పటియాలా, మే 6: పంజాబ్లో బీజేపీ అభ్యర్థులకు, నాయకులకు రైతుల నుంచి పెద్ద ఎత్తున నిరసన సెగ ఎదురవుతున్నది. బీజేపీ ఎన్నికల ప్రచారం ఎక్కడ ఉంటే.. అక్కడ నల్ల జెండాలతో రైతులు నిరసనకు దిగుతున్నారు. తమ డిమాండ్లపై బీజేపీ అభ్యర్థుల్ని అన్నదాతలు నిలదీస్తున్నారు. అయితే.. రైతుల పేరుతో ఆప్, ఎస్ఏడీ (శిరోమణి అకాలీదళ్), కాంగ్రెస్ పార్టీలు బీజేపీ ప్రచారాన్ని అడ్డుకుంటున్నాయని, తమ అభ్యర్థులను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయని పంజాబ్ బీజేపీ చీఫ్ సునీల్ జాఖర్ ఆరోపిస్తున్నారు. దీనిపై బీజేపీ నాయకుల బృందం సోమవారం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేసింది. స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే తమ హక్కును కాలరాస్తున్నారని ఈసీకి ఒక మెమోరాండం సమర్పించింది. ఆప్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు ఒక్కటై బీజేపీ ఎన్నికల ప్రచారాన్ని బలవంతంగా నిలిపివేస్తున్నారని జాఖర్ ఆరోపించారు. బలవంతంగా తమ ఎన్నికల ప్రచారాన్ని అడ్డుకోవటం ఘర్షణలు, హింసకు దారితీస్తున్నదని తెలిపారు. ఈ అంశంపై ఈసీ జోక్యం చేసుకోవాలని కోరారు.
పటియాలాలో రైతు హత్య..బీజేపీ నేతపై ఎఫ్ఐఆర్
పటియాలా లోక్సభ స్థానంలో బీజేపీ అభ్యర్థి ప్రణీత్ కౌర్కు వ్యతిరేకంగా నిరసన దిగటాన్ని సహించలేని కొంతమంది ఓ రైతు ప్రాణాల్ని బలితీసుకున్నారు. మే 4న జరిగిన ఈ ఘటనలో పోలీసులు అక్కడి బీజేపీ నేత హర్విందర్ సింగ్ హర్పాల్పూర్పై కేసు నమోదుచేశారు. ఈ ఘటనపై స్పందించిన ‘కిసాన్ మజ్దూర్ మోర్చా’, బీజేపీ నేత హర్పాల్పూర్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేసింది. లేదంటే బుధవారం ప్రణీత్ కౌర్ ఇంటి ముందు రైతులు నిరసనకు దిగుతారని హెచ్చరించింది.