BJP | న్యూఢిల్లీ, ఆగస్టు 25: కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి వచ్చే లోక్సభ ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతామని రైతులు, కార్మికులు ప్రతినబూనారు. గురువారం ఢిల్లీలోని తాల్కటోరా స్టేడియంలో జరిగిన అఖిల భారత రైతు, కార్మికుల ఉమ్మడి సదస్సు కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు, కార్మిక వ్యతిరేక విధానాలను తీవ్రంగా నిరసించింది. పంటలకు కనీస మద్దతు ధర(ఎంఎస్పీ) కల్పించాలన్న డిమాండ్తోపాటు ప్రైవేటీకరణ, లేబర్ కోడ్లకు వ్యతిరేకంగా ఉమ్మడిగా పోరాడాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం), కేంద్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జరిగిన ఈ సదస్సులో రైతు, కార్మిక నేతలు నిర్ణయం తీసుకొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలను ఎండగట్టేందుకు 2024 లోక్సభ ఎన్నికలకు ముందు భారీ ప్రచారోద్యమం చేపట్టాలని పిలుపునిచ్చారు. కేంద్ర ప్రభుత్వాన్ని నడిపిస్తున్న కార్పొరేట్-మతశక్తుల సంబంధాలకు ముగింపు పలకాలని, కార్పొరేట్ అనుకూల విధానాలు అవలంబిస్తున్న బీజేపీని గద్దె దించాలని సదస్సులో తీర్మానం చేశారు.
ప్రైవేటీకరణనే కేంద్ర ప్రభుత్వం ప్రధాన పాలసీగా ఉన్నదని ఉమ్మడి తీర్మానంలో రైతు, కార్మిక సంఘాలు విమర్శించాయి. ప్రజల సొమ్ముతో నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలను అప్పనంగా కార్పొరేట్లకు కట్టబెడుతున్నదని పేర్కొన్నాయి. ఎయిర్పోర్టులు, హైవేలు, పోర్టులు, రైల్వే ట్రాకులు, స్టేషన్లు.. ఇలా అన్నీ కార్పొరేట్ల చేతుల్లోకి వెళ్లిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశాయి. ఆఖరుకు విద్యావ్యవస్థను కూడా ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయిస్తున్నారని తీర్మానం దుయ్యబట్టింది. ప్రభుత్వ రంగ బ్యాంకులను ప్రైవేటీకరణ చేసేందుకు విలీనం చేస్తున్నారని, ఎల్ఐసీ, జీఐసీ వంటి సంస్థలను కూడా కేంద్రం టార్గెట్గా చేసుకొన్నదని ఆగ్రహం వ్యక్తం చేసింది. రక్షణ పరికరాలను ఉత్పత్తి చేసే కీలకమైన దేశంలోని 41 ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలను 7 కార్పొరేషన్లుగా మార్చారని, ఇది దేశ, కార్మిక వ్యతిరేక చర్య అని తప్పుబట్టింది. రక్షణ, రైల్వే శాఖలకు చెందిన భూములపై కూడా కేంద్రంలోని బీజేపీ సర్కార్ కన్నేసిందని రైతు, కార్మిక సంఘాలు తీర్మానంలో ఆరోపించాయి.
దేశంలో పెచ్చరిల్లుతున్న నిరుద్యోగం, లక్షలాది సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలు ఖాళీగా ఉండటంపై సదస్సు ఆందోళన వ్యక్తం చేసింది. దీనికితోడు ప్రభుత్వ సంస్థల ప్రైవేటీకరణ వలన వేలాది కార్మికుల ఉద్యోగాలు పోతున్నాయని, ఇందులో కాంట్రాక్టు కార్మికులు ప్రధాన బాధితులుగా ఉన్నారని పేర్కొన్నది. కొవిడ్పై పోరాటంలో కీలకంగా నిలిచిన ఆరోగ్య రంగంలోని కాంట్రాక్ట్ వర్కర్లను పర్మినెంట్ చేస్తామని మోసం చేశారని, వారిని ఉద్యోగాల నుంచి తీసేయడం దారుణమని ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘తమతో పాటు దేశ ఇబ్బందులు, కష్టాలకు కారణమైన నిజమైన శత్రువు ఎవరో రైతులు, కార్మికులతో పాటు సాధారణ ప్రజలకు అవగాహన కల్పించాలి. కేంద్రంలోని దేశ వ్యతిరేక విధ్వంసక పాలనను కార్పొరేట్-మత సంబంధాలు నడిపిస్తున్నాయి. వారు(బీజేపీ) కార్పొరేట్ అనుకూల విధానాలను మార్చుకొంటారని అనుకోలేం. వారిని(బీజేపీ)ని అధికారం నుంచి తరిమి కొట్టాల్సిందే’ అని రైతు, కార్మిక సంఘాలు ఉమ్మడి తీర్మానంలో పేర్కొన్నాయి. కేంద్రంలో లేదా రాష్ర్టాల్లో ఏ ప్రభుత్వమూ రైతు, కార్మిక విధానాలు పాటించేలా సాహసం చేయకుండా ఉమ్మడిగా, సమన్వయంతో పోరాటాలు చేయాలని నిర్ణయించుకొన్నాయి.
1. లఖింపూర్ ఖేరీ బాధిత రైతుల స్మారకంగా అక్టోబర్ 3న ‘బ్లాక్ డే’ పాటింపు
2. నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా 2020లో రైతు ఉద్యమ ప్రారంభం, చారిత్రక కార్మికుల సమ్మెను గుర్తుచేసుకొంటూ నవంబర్ 25-26న మహాపడావ్ నిర్వహణ
3. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా డిసెంబర్ నుంచి భారీ ప్రచారోద్యమానికి శ్రీకారం