Farmers agitaion | మరోసారి రైతులు రోడ్డెక్కారు. ఢిల్లీ-హర్యానా రోడ్డుపై ఆందోళనకు దిగారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గత ఆందోళనలో చనిపోయిన రైతుల కుటుంబాలకు ఇంతవరకు ఎలాంటి పరిహారం అందించకపోవడంపై రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళనలు చేశారు. కేంద్ర ప్రభుత్వం దిగొచ్చి వారి డిమాండ్ల పరిష్కారానికి హామీ ఇవ్వడంతో వారి ఆందోళనలను విరమించారు. రైతులు తమ ఆందోళనలు విరమించి ఇవాల్టికి ఏడాది అయింది. దీనిని పురస్కరించుకుని హర్యానా, పంజాబ్ రాష్ట్రాలకు చెందిన అన్నదాతలు బహదూర్ఘర్ పట్టణం నుంచి తిక్రీ సరిహద్దుకు పాదయాత్ర నిర్వహించారు. రైతులు దేశ రాజధానిలోకి రాకుండా నిరోధించేందుకు పోలీసులు కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. తిక్రీ సరిహద్దుల్లో బారికేడ్లు పెట్టారు.
రైతుల రుణమాఫీ, కనీస మద్దతు ధరకు చట్టబద్ధమైన హామీ తదితర డిమాండ్లను లేవనెత్తుతూ పంజాబ్లోని హుస్సేనివాలా నుంచి తిక్రీ సరిహద్దు వరకు రైతులు ‘మషాల్ యాత్ర’ చేపట్టారు. ఈ యాత్ర కారణంగా దాదాపు గంటకు పైగా వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సోనిపట్లోని రాజీవ్గాంధీ ఎడ్యుకేషన్ సిటీ వద్ద ఇవాళ కిసాన్ పంచాయతీ జరుగనున్నది. ఈ పంచాయతీలో ఎంఎస్పీ గ్యారెంటీతోపాటు ఆందోళనలో చనిపోయిన రైతుల కుటుంబాలకు పరిహారం, ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని మరోసారి డిమాండ్ చేయనున్నారు. కేంద్రంలోని బీజేపీ పెద్దల పోకడ ఇలాగే ఉంటే రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సరైన గుణపాఠం చెప్తామని పలువురు రైతులు అంటున్నారు.