బెంగళూరు, డిసెంబర్ 29 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధర లభించకపోవడంతో కర్ణాటకలోని మాండ్య రైతులు మండిపడ్డారు. ఆ రాష్ట్ర సీఎం బసవరాజ్ బొమ్మై ప్రతిమకు రక్తాభిషేకం చేసి, తీవ్ర నిరసన తెలిపారు. చెరుకు పంటకు కనీస మద్దతు ధర నిర్ణయించాలని డిమాండ్ చేస్తూ మాండ్య రైతాంగం 50 రోజుల నుంచి స్థానిక విశ్వేశ్వరయ్య విగ్రహం వద్ద రిలే నిరాహార దీక్షలు చేస్తున్నది. పట్టణంలో నిరసన ప్రదర్శనలు చేపడుతున్నది. వివిధ రాజకీయ పార్టీలు రైతులకు మద్దతు ప్రకటించాయి.
అయినా..రాష్ట్ర సర్కారు దిగిరాలేదు. దీంతో కోపోద్రిక్తులైన చెరుకు రైతులు మాండ్య నడి బొడ్డున ఉన్న విశ్వేశ్వరయ్య విగ్రహం ఎదుట సిమెంటుతో చేసిన బొమ్మై ప్రతిమను ఉంచారు. సిరింజితో తమ రక్తాన్ని తీసి ఆ ప్రతిమకు అభిషేకం చేశారు. ‘తీపి కబురు చెప్తానని మోసం చేసిన బొమ్మైకి మా రక్తాన్ని ఇచ్చాం’ అంటూ నినదించారు. కాగా, సమాచారం అందుకొన్న పోలీసులు మెరుపు దాడి చేశారు. దీక్షా శిబిరాన్ని బలవంతంగా తొలగించారు. రైతులను అదుపులోకి తీసుకొన్నారు. పొద్దుపోయాక వారిని విడిచిపెట్టారు.
పోలీస్ స్టేషన్నుంచి విడుదలైన రైతులు నేరుగా విశ్వేశ్వరయ్య విగ్రహం వద్దకు వచ్చి తమ ఆందోళనను కొనసాగించారు. దీంతో దిగి వచ్చిన పోలీసులు నిరాహార దీక్షా శిబిరం ఏర్పాటుకు అనుమతించారు. కాగా, శుక్రవారం మాండ్య నగరంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పర్యటన నేపథ్యంలో రైతుల ఆందోళన రాష్ట్ర నాయకులను కలవరపెడుతున్నది. నగరంలో అమిత్ షా బహిరంగ సభ నిర్వహించనున్నందున ఒక్కరోజు ఆందోళన విరమించాలని ఉన్నతాధికారులు విన్నవించినా రైతులు ససేమిరా అన్నారు. తాము శాంతియుతంగా ఆందోళన కొనసాగిస్తామని, అమిత్ షాను దీక్షా శిబిరానికి తీసుకురావాలని రైతులు డిమాండ్ చేశారు.