బెంగళూరు, ఫిబ్రవరి 26: మురికి దుస్తులు ధరించాడన్న కారణంగా ఓ అన్నదాతను బెంగళూరులో మెట్రో రైలు ఎక్కనివ్వలేదు. ఈ నెల 18న జరిగిన ఈ ఘటనను ఓ ప్రయాణికుడు ఈ నెల 24న సామాజిక మాధ్యమంలో పోస్ట్ చేశాడు. రాజాజీనగర్ స్టేషన్లో మెట్రో రైలు ఎక్కేందుకు వచ్చిన రైతును సెక్యూరిటీ సూపర్వైజర్ అక్కడి నుంచి వెళ్లగొట్టేందుకు ప్రయత్నించాడు. ఇది చూసిన మరో ప్రయాణికుడు కార్తీక్ వెంటనే జోక్యం చేసుకుని ఏ కారణంతో రైతును మెట్రో రైలు ఎక్కనివ్వడం లేదని ప్రశ్నించాడు. టికెట్ కొనుక్కొని రైలెక్కేందుకు వచ్చిన వ్యక్తిని ఎందుకు అడ్డుకుంటున్నావని నిలదీశాడు.
రైతు తలపై ఉన్న మూటలో కూడా ఎటువంటి నిషేధిత పదార్థాలు లేవని చెప్పాడు. మెట్రో రైలు ఎక్కేందుకు ప్రయాణికులు ఎటువంటి దుస్తులు ధరించాలన్న దానిపై ఏదైనా డ్రెస్ కోడ్ ఉంటే చూపించాలని అన్నాడు. ఆ తరువాత సదరు ప్రయాణికుడు ఆ రైతును తనతోపాటు రైలులో తీసుకెళ్లాడు. ఈ ఘటన సోషల్మీడియాలో వైరల్ కావడమే కాకుండా బెంగళూరు మెట్రో వ్యవస్థను విమర్శలు పాలుచేసింది. మెట్రో రైలు కేవలం వీఐపీలకేనా, సామాన్యులు ఎక్కకూడదా అంటూ నెటిజన్లు మెట్రో అధికారులపై విమర్శలు కురిపించారు. దీనిపై స్పందించిన బీఎంఆర్సీఎల్ ఆ ఘటనపై దర్యాప్తుకు ఆదేశించింది, రైతుకు జరిగిన అవమానం పట్ల విచారం వ్యక్తంచేస్తూ.. సెక్యూరిటీ సూపర్వైజర్ను విధుల నుంచి తొలగిస్తున్నట్టు ప్రకటించింది.