Mallikarjun Kharge | ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రకటనతో దేశంలో రాజకీయ వేడి మొదలైంది. తెలంగాణతో పాటు మరో నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్ను కేంద్ర ఎన్నికల సంఘం ఇవాళ ప్రకటించిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) స్పందించారు. బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రకటనతోపాటు.. బీజేపీకి ఫేర్వెల్ (Farewell) ప్రకటించినట్లైందని విమర్శించారు.
ఈ మేరకు ఆయన ట్వీట్ చేశారు. ‘ఐదు రాష్ట్రాల ఎన్నికల ప్రకటనతో.. బీజేపీ దాని మిత్ర పక్షాలకు ఫేర్వెల్ ప్రకటించినట్లే. ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో రాబోయే ఎన్నికల్లో సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం, ప్రగతిశీల అభివృద్ధే ధ్యేయంగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్తుంది’ అని ట్వీట్లో పేర్కొన్నారు.
5 राज्यों के चुनावों की घोषणा के साथ भाजपा और उसके साथियों की विदाई का भी उद्घोष हो गया है।
छत्तीसगढ़, मध्य प्रदेश, राजस्थान, तेलंगाना और मिजोरम में कांग्रेस पार्टी मज़बूती के साथ जनता के पास जाएगी।
जन-कल्याण, सामाजिक न्याय और प्रगतिशील विकास ही कांग्रेस पार्टी की गारन्टी…
— Mallikarjun Kharge (@kharge) October 9, 2023
మోగిన ఎన్నికల నగారా.. పోలింగ్ ఏ రాష్ట్రంలో ఎప్పుడంటే..!
దేశంలో తెలంగాణ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు నగారా మోగింది. కేంద్ర ఎన్నికల సంఘం చీఫ్ ఎలక్షన్ కమిషనర్ రాజీవ్ కుమార్ ఎన్నికల షెడ్యూల్ను సోమవారం విడుదల చేశారు. ఎన్నికల సంఘం వెల్లడించిన వివరాల ప్రకారం.. తెలంగాణలో నవంబర్ 3న పోలింగ్ జరగనుంది. నవంబర్ 3 నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుంది. నవంబర్ 15 నామినేషన్ల ఉపసంహరణకు చివరితేది. నవంబర్ 30న పోలింగ్ జరుగుతుంది. డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు.
మిజోరంలో నవంబర్ 7న పోలింగ్ జరుగుతుంది. ఇక సమస్యాత్మక ప్రాంతాల్లో భద్రతా కారణాల రీత్యా ఛత్తీస్గఢ్లో రెండు విడతల్లో పోలింగ్ నిర్వహించనున్నారు. నవంబర్ 7న తొలి విడత పోలింగ్, నవంబర్ 17న రెండో విడత పోలింగ్ జరుగనుంది. మధ్యప్రదేశ్, రాజస్థాన్ రాష్ట్రాల్లో కూడా తెలంగాణలో మాదిరిగా ఒకే విడతలో పోలింగ్ నిర్వహించనున్నారు. మధ్యప్రదేశ్లో నవంబర్ 17న, రాజస్థాన్లో నవంబర్ 23న పోలింగ్ నిర్వహించనున్నట్లు ఎన్నికల కమిషన్ ప్రకటించింది.
ఛత్తీస్గఢ్, మిజోరం అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి అక్టోబర్ 13న గెజిట్ నోటిఫికేషన్ విడుదల కానుంది. నామినేషన్ల స్వీకరణకు చివరి తేది అక్టోబర్ 20, నామినేషన్ల ఉపసంహరణకు చివరి తేదీ అక్టోబర్ 23. అక్టోబర్ 21 నామినేషన్ల స్క్రూటినీ జరుగుతుంది. మధ్యప్రదేశ్లో అక్టోబర్ 21న గెజిట్ నోటిఫికేషన్ రానుంది. అక్టోబర్ 21 నుంచి నవంబర్ 2 వరకు నామినేషన్ల ప్రక్రియ కొనసాగుతుంది. రాజస్థాన్లో అక్టోబర్ 30న గెజిట్ నోటిఫికేషన్ వస్తుంది. అదే రోజు నుంచి నవంబర్ 9 వరకు నామినేషన్ల ప్రక్రియ జరుగుతుంది.
Also Read..
Women voters | పెరిగిన మహిళా ఓటర్లు.. తెలంగాణలో ఎంత మంది అంటే..?
Assembly Elections | 3న నోటిఫికేషన్.. అదేరోజున నామినేషన్ల ప్రక్రియ షురూ..