PM Modi | న్యూఢిల్లీ, సెప్టెంబర్ 24: బీజేపీ విశ్వగురువుగా ప్రచారం చేస్తున్న ప్రధాని నరేంద్రమోదీ ఆర్థిక విధానాలు దేశ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశాయి. దేశంలో ఎన్నడూ లేనంతగా సంపద కేంద్రీకరణ జరిగింది. నిరుద్యోగం 47 ఏండ్ల గరిష్టానికి చేరింది. 18-25 ఏండ్ల లోపు పట్టభద్రుల్లో నిరుద్యోగిత ఏకంగా 42 శాతానికి చేరుకొన్నది. అంటే దాదాపు ప్రతి ఇద్దరిలో ఒకరు నిరుద్యోగిగానే ఉండిపోతున్నారు. నిత్యావసరాల కోసం కూడా ప్రజలు అప్పులు చేసే పరిస్థితి దాపురించింది. ఇదంతా ఏదో అల్లాటప్పాగా చెప్తున్నది మాట కాదు. ఇటీవల అజీజ్ ప్రేమ్జీ యూనివర్సిటీ నిర్వహించిన సర్వేలో బయటపడిన పచ్చి నిజాలు.. ప్రపంచబ్యాంకు నివేదికలోనూ ఇంచుమించు ఇదే విషయం స్పష్టమైంది. అంతకుమించి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇటీవల విడుదల చేసిన బులెటిన్లో ఇవే విషయాలు వెల్లడించింది.
దేశంలో 25 ఏండ్లలోపు పట్టభద్రుల్లో 42% మంది ఉద్యోగాలు దొరక్క రోడ్లవెంట తిరుగుతున్నారు. 2020లో దేశ జనాభాలో కూలీలు 43 శాతం ఉండగా, మూడున్నరేండ్ల తర్వాత ప్రస్తుతం కూడా 40% కూలీలుగానే ఉన్నారు.
నెల క్రితం వరకు టొమాటో ధర ఎగువ మధ్యతరగతి వర్గాలకు కూడా అందనంత ఎత్తుకు చేరింది. చాలాచోట్ల కిలో 260 దాకా అమ్ముడుపోయింది. టొమాటో ధర ఇలా దిగొచ్చిందో లేదో.. ఇతర నిత్యావసరాల ధరలు ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ ఏడాది జనవరి నుంచి కందిపప్పు ధర ఏకంగా 45 శాతం పెరిగింది. గోధుమ పిండి ధర 20 శాతం, శనగపిండి ధర 21 శాతం పెరిగాయి. గత ఆగస్టు నుంచే పంచదార ధర 5 శాతం పెరిగింది.
మోదీ సర్కారు వచ్చాక పారిశ్రామిక రంగంలో అత్యంత దుష్ట విధానాలు అమల్లోకి వచ్చాయి. బీజేపీకి స్నేహితులుగా ఉన్న పిడికెడు మంది చేతుల్లోకి దేశంలోని అత్యంత విలువైన సంపదంతా చేరిపోయింది. 2022లో మొత్తం పారిశ్రామిక లాభాల్లో 80 శాతం వాటా కేవలం 20 కంపెనీలకే చేరిందని మార్సెల్లస్ ఫండ్ ప్రకటించింది.
ఏ ఆర్థిక వ్యవస్థ ప్రగతి అయినా రుణ లభ్యతపైనే ఆధారపడి ఉంటుంది. మోదీ ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో దేశంలో పరిశ్రమలకు రుణ లభ్యత గగనమైపోయింది. 2004లో దేశీయ రుణ లభ్యత 36.2 శాతం ఉండగా, 2014 నాటికి 51.9 శాతానికి పెరిగింది. ఆ తర్వాత తొమ్మిదేండ్లలో తిరోగమనం బాట పట్టి 2021 నాటికి 50.4 శాతానికే పరిమితమైంది.
దేశవ్యాప్తంగా ప్రజలు ఇండ్లు, వాహనాలను భారీగా కొనుగోలు చేస్తున్నారని కేంద్ర ఆర్థికశాఖ చెప్తున్నది. కానీ, ఆర్బీఐ నివేదిక ప్రకారం ప్రజలు అవసరాల కోసం రుణాలు చేయటం పెరిగిందని తేలింది. గత ఏడాది కాలంలో బంగారంపై లోన్లు 23 శాతం పెరగ్గా, పర్సనల్ లోన్లు 29 శాతం పెరిగాయి. అంటే ప్రజలు తమ నిత్యజీవిత అవసరాలు తీర్చుకొనేందుకు కూడా అప్పులు చేయాల్సిన దుస్థితి వచ్చిందన్నమాట.
అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ప్రజల పొదుపే ఆర్థికవ్యవస్థకు పెట్టుబడి. కానీ, మోదీ సర్కారు వచ్చిన తర్వాత సామాన్యుల చేతిలో చిల్లిగవ్వ మిగలటం లేదు. 2022 ఆర్థిక సంవత్సరంలో దేశ జీడీపీలో పొదుపు వాటా 7.2% ఉండగా, 2023 ఆర్థిక సంవత్సరంలో 5.1 శాతానికి పడిపోయింది. ఇది 47 ఏండ్ల కనిష్టం.
దేశంలో ఆర్థిక సంస్కరణలు చేపట్టిన తర్వాత తొలిసారి మోదీ హయాలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు తగ్గిపోయాయి. అంతకుముందుతో పోల్చితే 2023లో ఎఫ్డీఐలు 16 శాతం పడిపోయాయని ఆర్బీఐ బులెటిన్లో తెలిపారు. జీడీపీలో ఎఫ్డీఐల వాటా 2014లో 1.7 శాతం ఉండగా, 2022 నాటికి 1.5 శాతానికి తగ్గింది.
దేశ చరిత్రలో ఎన్నడూ లేనంతగా చిన్నవ్యాపారాలు మోదీ సర్కారు హయాంలో ధ్వంసమైపోయాయి. 2014కు ముందు చిన్నవ్యాపారాల అమ్మకాల విలువ 7 శాతం ఉండగా, 2023 మొదటి త్రైమాసికంలో చరిత్రలోనే అతి తక్కువగా 4 శాతానికి పడిపోయింది. లక్షమంది చిన్నవ్యాపారులు భాగస్వాములుగా ఉన్న కన్సార్టియం ఆఫ్ ఇండియన్ అసోసియేషన్ సర్వే ప్రకారం 75 శాతం చిన్న వ్యాపార సంస్థలు నష్టాల్లో కూరుకుపోయాయి.