చెన్నై: తమిళనాడులో బీహారీ కార్మికులు హత్యకు గురయ్యారంటూ నకిలీ వార్తలు వ్యాప్తి చేసిన హిందీ వార్తా పత్రిక దైనిక్ భాస్కర్, బీజేపీ యూపీ అధికార ప్రతినిధి ప్రశాంత్ పటేల్ ఉమ్రావ్పై తమిళనాడు పోలీసులు కేసు నమోదు చేశారు. 15 మందికిపైగా బీహార్ కార్మికులు తమిళనాడులో హత్యకు గురయ్యారని, మిగతావారు అణచివేతకు, బెదిరింపులకు గురయ్యారని ఈ నెల 2న దైనిక్ భాస్కర్ వార్త ప్రచురించింది. హిందీ మాట్లాడే 15 మందిని ఒక గదిలో ఉరి తీశారని, అందులో 12 మంది చనిపోయారని అదే రోజు ఉమ్రావ్ ట్వీట్ చేశారు. దీనిపై తమిళనాడు పోలీసులు అదే రోజు స్పందిస్తూ ఈ వార్తలు కేవలం పుకార్లు మాత్రమేనని ట్వీట్ చేశారు. ఈ నేపథ్యంలో బీహారీ కార్మికులకు తగిన భద్రత కల్పించాలని బీహార్ సీఎం నితీశ్ కుమార్ ట్వీట్ చేశారు. దీనికి తమిళనాడు సీఎం స్టాలిన్ స్పందిస్తూ తమ రాష్ట్రంలో వలస కార్మికులందరూ క్షేమంగా ఉన్నారన్నారు.