న్యూఢిల్లీ, ఆగస్టు 5: దేశవ్యాప్తంగా ఉన్న యూనివర్సిటీల్లో డిగ్రీ ప్రవేశాల కోసం ఉద్దేశించిన కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ (సీయూఈటీ) రెండో దశ పరీక్షల రెండో రోజు కూడా సాంకేతిక సమస్యలు తలెత్తాయి. దీంతో చాలా సెంటర్లలో విద్యార్థులు పరీక్ష రాయలేకపోయారు. మధ్యాహ్నం జరుగాల్సిన రెండో షిఫ్ట్లో సాంకేతిక లోపాల కారణంగా పరీక్ష వాయిదా పడింది.
అయితే ఉదయం పరీక్ష మాత్రం దాదాపు 95 శాతం సెంటర్లలో సజావుగా సాగిందని పరీక్ష నిర్వహణ సంస్థ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీయే) వెల్లడించింది. గురువారం మధ్యాహ్నం జరుగాల్సిన పరీక్ష కూడా ఇదే కారణాలతో వాయిదాపడింది. అయితే వీటన్నింటినీ ఆగస్టు 12న నిర్వహిస్తామని ఎన్టీయే తెలిపింది. అయితే సరైన ఏర్పాట్లు చేయడంలో ఎన్టీయే తీవ్రంగా విఫలమైందని విద్యార్థులు మండిపడుతున్నారు.