న్యూఢిల్లీ: మూడు కొత్త వ్యవసాయ చట్టాల ప్రయోజనాల గురించి రైతులను ఒప్పించడంలో విఫలమయ్యామని కేంద్ర వ్యవసాయ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. అందుకే వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకుంటామన్న ప్రధాని మోదీ ప్రకటనపై ఆయన ఈ మేరకు స్పందించారు. ‘పార్లమెంటు ఆమోదించిన మూడు బిల్లులను ప్రధాని తీసుకొచ్చారు. వాటి వల్ల రైతులకు మేలు జరిగేది. రైతుల జీవితాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలన్నదే ప్రధాని స్పష్టమైన ఉద్దేశం. కానీ దేశంలోని కొంతమంది రైతులకు ప్రయోజనాలను వివరించడంలో విఫలమైనందుకు నేను బాధపడ్డాను’ అని అన్నారు.
అయితే రైతుల సంక్షేమం, వ్యవసాయ రంగ అభివృద్ధికి ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర మంత్రి తోమర్ తెలిపారు. జీరో బడ్జెట్ ఫార్మింగ్, కనీస మద్దతు ధర (MSP), పంటల వైవిధ్యీకరణకు సంబంధించిన సమస్యలను పరిష్కరించడానికి ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ప్రధాని నిర్ణయించినట్లు ఆయన చెప్పారు. ఈ కమిటీలో కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాల ప్రతినిధులతో పాటు రైతులు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు సభ్యులుగా ఉంటారని వెల్లడించారు.